హైదరాబాద్, సెప్టెంబర్ 12: గ్లోబల్ ఫార్మా దిగ్గజం డీఎఫ్ఈ ఫార్మా హైదరాబాద్లో నెలకొల్పిన కీలకమైన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. ‘క్లోజర్ టు ఫార్ములేటర్’ (సీ2ఎఫ్)గా పనిచేసే ఈ సెంటర్ వివిధ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వాటి ఔషధ అభివృద్ధిలో అన్ని దశల్లోనూ నైపుణ్యాన్ని అందిం చి, వాణిజ్య ఉత్పత్తికి అవసరమయ్యే సమయాన్ని తగ్గిస్తుంది. జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీఎఫ్ఈ ఫార్మా హైదరాబాద్లోని జెనోమ్ వ్యాలీలో సీ2ఎఫ్ను ఏర్పాటుచేసింది.
ప్రారంభసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డీఎఫ్ఈ ఫార్మా సీ2ఎఫ్తో జీనోమ్ వ్యాలీ అందిస్తున్న మద్దతు, వృద్ధిని మరింత పటిష్టపరుస్తుందని, రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునే దిశగా డీఎఫ్ఈ ఫార్మాతో తెలంగాణ ప్రభుత్వం కలసి పనిచేస్తుందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ అయిన జీనోమ్ వ్యాలీలోని ప్రధాన ప్రాంతంలో ఏర్పాటుచేసిన తమ సీ2ఎఫ్ ద్వారా ఫార్మాస్యూటికల్, నూట్రాస్యూటికల్ కంపెనీలు వాటి ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తయ్యేందుకు సహకరిస్తుందని డీఎఫ్ఈ ఫార్మా సీఈవో మార్టి హెడ్మాన్ చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ఫార్మా, లైఫ్సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ప్రధాన ఫార్మా కంపెనీల సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు.