SUV Cars | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకే మొగ్గు చూపుతున్నారు. అందునా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి రెండు కార్ల కొనుగోళ్లలో ఒకటి ఎస్యూవీ అంటే అతి శయోక్తి కాదు. గతేడాది మొత్తం కార్ల సేల్స్లో 51.5 శాతం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)లేనని ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) నివేదికలో తేలింది. గతేడాది దేశీయంగా కార్ల విక్రయాలు 26.73 శాతం పెరిగాయి. 2021-22లో 30,69,523 కార్లు అమ్ముడైతే 2022-23లో 38,90,114 కార్లు అమ్ముడయ్యాయి. రోజురోజుకి ఎంట్రీ లెవెల్ కార్లు, టూ వీలర్స్కు గిరాకీ తగ్గుతున్నది.
గత ఏడాదంతా అధిక ద్రవ్యోల్బణం నమోదవుతున్నా.. ఎస్యూవీ కార్లంటే ప్రతి ఒక్కరూ మోజు పెంచుకుంటున్నారు. సెమీ కండక్టర్ చిప్ల సరఫరా మెరుగు పడటంతో అధికాదాయ వర్గాల వారి నుంచి గిరాకీ పెరుగుతున్నది. 2021-22లో ఎస్యూవీ వెహికల్స్ 14,89,219 కార్లు అమ్ముడైతే, 2022-23లో 20,03,718 యూనిట్లకు పెరిగింది. అంటే 2021-22తో పోలిస్తే 2022-23లో మొత్తం కార్ల సేల్స్లో 51. శాతం ఎస్యూవీలే.
2016-17 ఆర్థిక సంవత్సరం తర్వాత క్రమంగా ఎంట్రీ లెవల్ కార్లకు, టూ వీలర్స్కు గిరాకీ తగ్గుతున్నది. 2016-17లో అత్యధికంగా ఎంట్రీ లెవల్ కార్లు అమ్ముడు కాగా, గత ఏడాది 57 శాతం తగ్గింది. 2018-19లో గరిష్టంగా ఎంట్రీ లెవెల్ స్కూటర్లు అమ్ముడు పోగా, 2022-23లో 27 శాతం తగ్గాయి. 2018-19తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మోటార్ సైకిళ్ల సేల్స్ 38 శాతం పడిపోయాయి. రెగ్యులేటరీ నిబంధనలు, ధరల పెరుగుదల వల్ల కార్లు, మోటార్ బైక్లు, స్కూటర్ల ధరలు అందుబాటులో లేకుండా పోయాయని సియామ్ అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ తెలిపారు.
2022 మార్చితో పోలిస్తే, గత నెలలో కార్ల విక్రయాలు 4.7 శాతం వృద్ధి చెందాయి. అన్ని క్యాటగిరీల వెహికిల్ సేల్స్ డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేశాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) పేర్కొంది. ఇక 2018-19 తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో కార్ల సేల్స్లో రికార్డు నమోదైంది. 2018-19లో 33,77,436 కార్లు అమ్ముడైతే, గత ఏడాది 38,90,114 కార్లు సేల్ అయ్యాయి.