Office Space | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలు హాట్కేక్లా ఎగరేసుకొని పోతున్నాయి కార్పొరేట్ సంస్థలు. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల గిరాకీ రెండంకెల వృద్ధి నమోదైందని వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్ స్థలాల డిమాండ్ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అలాగే హైదరాబాద్లో ఆఫీస్ స్థలం గిరాకీ నెలకొన్నది.
తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది. ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్లో కూడా 40 శాతం తగ్గింది.