NITI Aayog Suman Bery | నీతి ఆయోగ్ నూతన ఉపాధ్యక్షుడిగా పేరొందిన ఆర్థిక వేత్త-రీసెర్చ్ అడ్మినిస్ట్రేటర్ సుమన్ బెరీ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ రాజీవ్ కుమార్ నుంచి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా సుమన్ బెరీ బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా సుమన్ బెరీ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్న తరుణంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ప్రభుత్వంలోనూ, ప్రభుత్వం బయట అనుబంధం గల నూతన, యువత ప్రతిభావంతులతో కూడిన శక్తిమంతమైన సంస్థ బాధ్యతలు తనకు అప్పగించారన్నారు.
భారత్ ఆర్థిక, సామాజిక పరిస్థితులు యావత్ ప్రపంచ ప్రాముఖ్యం కలిగి ఉంటాయని సుమన్ బెరీ చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి కోసం విస్తృత చర్చలు, లోతైన విశ్లేషణ ఆధారిత విజన్ను డెవలప్ చేయడం నీతి ఆయోగ్కు సవాల్ అని అన్నారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చి (ఎన్సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్)గా, రాయల్ డచ్ షెల్ చీఫ్ ఎకనమిస్ట్గా సుమన్ బెరీ పని చేశారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, ద్రవ్య పరపతి విధానంపై ఆర్బీఐ సాంకేతిక సలహా కమిటీ సభ్యుడిగానూ సేవలందించారు. ఎన్సీఏఈఆర్లో పని చేయడానికి ముందు వరల్డ్ బ్యాంక్లో పని చేశారు.