Tesla Cars | విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లపై సుంకాలు తగ్గించాలని గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం మన్నించినట్లే కనిపిస్తున్నది. తొలుత మూడేండ్ల వరకు దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని సమాచారం. అయితే, తొలుత దేశంలో కార్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై టెస్లాను బిజినెస్ ప్లాన్ సమర్పించాలని కోరినట్లు తెలుస్తున్నది. భారత విపణిలో తమ కార్ల ఆవిష్కరణకు దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని ఆ సంస్థ సీఈవో ఎలన్మస్క్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
టెస్లా అభ్యర్థన మేరకు దిగుమతి సుంకాల తగ్గింపు విషయమై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నదన్నారు. టెస్లా సీఈవో ప్రతిపాదనలను అన్ని మంత్రిత్వశాఖలు పరిశీలించిన తర్వాత ఆర్థికశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.
విడి భాగాలతో దేశీయంగా అసెంబ్లీంగ్ చేసినందుకు లెవీ తగ్గించాలని కోరడానికి బదులు పూర్తిస్థాయిలో మాన్యుఫాక్చరింగ్ చేయొచ్చు కదా అని భారీ పరిశ్రమల శాఖ సూచిస్తున్నది. ఇప్పటికే దేశంలో టెస్లా కార్ల విడి భాగాల తయారీ ఇక్కడ జరుగుతున్నది. ఒకవేళ టెస్లా దిగుమతి చేసుకుంటున్న కార్లకు సుంకాలు తగ్గిస్తే, మిగతా సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఫలితంగా దేశీయంగా ఉపాధి కల్పన అవకాశాలు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నది.