RBI on Auto Debit | వివిధ బ్యాంకుల ఖాతాదారులు వాడే డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్ల ద్వారా జరిపే ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్స్ రూల్స్ మారిపోనున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయని ఆర్బీఐ తెలిపింది. దీని ప్రకారం ఆటో డెబిట్ లావాదేవీలపై సంబంధిత ఖాతాదారుల నుంచి కనీసం 24 గంటలు ముందుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్ (అదనపు ధ్రువీకరణ-ఏఎఫ్ఏ) పొందాలి. ఎస్సెమ్మెస్ ద్వారా గానీ, ఈ-మెయిల్ ద్వారా గానీ సంబంధిత బ్యాంకులకు ఖాతాదారులు సమాచారం ఇవ్వాలి.
అంతే కాదు.. సదరు మర్చంట్ పేరు, లావాదేవీల మొత్తం, డెబిట్ టైం, తేదీతోపాటు ఆ ట్రాన్సాక్షన్కు కారణాలు కూడా ముందస్తుగా వెల్లడించాలి. ఖాతాదారుల ఆమోదం లభించాకే ఆటో డెబిట్ జరుగుతుంది. ఈ రూల్స్ పాటించకపోతే, సంబంధిత ఖాతాదారుల డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఖాతాదారులు ఈ ప్రాసెస్ నుంచి ఆప్ట్-ఔట్ అయ్యేందుకు ఆప్షన్ కూడా ఉంది. ఆన్లైన్ రికరింగ్ పేమెంట్స్ రూ.5000 దాటిన ఆటో డెబిట్ లావాదేవీలకూ ఈ నిబంధన వర్తిస్తుంది.
రికరింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్పైన ఈ-మాండేట్ ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్ను ఆర్బీఐ తొలుత 2019 ఆగస్టులో ఖరారు చేసింది. దీన్ని 2020 జనవరిలో యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేసెస్ (యూపీఐ)లకూ పొడిగించింది. ఈ నిబంధన అమలు కోసం గత మార్చిలో బ్యాంకులకు మరో ఆరు నెలల గడువు పొడిగించింది. ఈ నెలాఖరుతో ఈ గడువు ముగిసిపోనున్నది.
ఈ లావాదేవీలు సజావుగా సాగడం కోసం ఖాతాదారులు తాము రోజువాడే మొబైల్ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ బ్యాంకులకు అందజేయాలి. కొత్త నిబంధనకు అనుగుణంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొబైల్ రీచార్జి బిల్స్, బీమా ప్రీమియం, వాటర్ అండ్ కరంట్ బిల్స్, నెలవారీ రుణ వాయిదాలకూ ఈ నిబంధనను పొడిగించారు.
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఆపిల్ మ్యూజిక్, స్పోటిఫై వంటి మ్యూజిక్ యాప్స్ వాడకం దారుల ఆటో డెబిట్ చెల్లింపులపై ఆర్బీఐ అమలులోకి తెస్తున్న నూతన రూల్ ప్రభావం చూపనున్నది. ఓటీటీ ప్లాట్ఫామ్స్, మ్యూజిక్ యాప్స్ వాడకానికి రూ.5000 మించి చెల్లించాల్సి వస్తే.. ఏఎఫ్ఏ తీసుకోవాల్సిందే. అయితే, బ్యాంకులకు స్పష్టమైన సూచనలు చేస్తే మాత్రం మీ బ్యాంకు ఖాతా నుంచి మ్యూచువల్ ఫండ్ సిప్, బీమా ప్రీమియం ఇతర రికరింగ్ పేమెంట్స్ మీద ప్రతికూల ప్రభావం పడదు.
ఈ నిబంధన అమలుకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు తమ ఖాతాదారులకు మ్యాండేట్ జారీ చేయనందువల్లే ఆర్బీఐ ఆరు నెలలు పొడిగించింది. ఈ నెలాఖరుతో ఈ గడువు ముగియనున్నది. ఈ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా సేవలందించడంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ జారీచేసిన సర్క్యులర్లో హెచ్చరించింది.