న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశీయ రిటైల్ వ్యాపార సంస్థ డీ-మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ.. ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్ హురున్ ఇండియా గురువారం విడుదల చేసిన టాప్-200 సెల్ఫ్ మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిల్లేనియా 2023 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. సంస్థ మార్కెట్ విలువ రూ.2.38 లక్షల కోట్లుగా ఉన్నది. రెండో స్థానంలో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్ రూ.1.19 లక్షల కోట్లతో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జొమాటో దీపిందర్ గోయల్ (రూ.86,835 కోట్లు), డ్రీమ్ 11 ప్రమోటర్లు భవిత్ సేత్, హరీశ్ జైన్ (రూ.66.452 కోట్లు) ఉన్నారు. ఇదిలావుంటే జాబితాలోని అన్ని సంస్థల విలువ కలిసి రూ.30 లక్షల కోట్లుగా ఉన్నది. ఇది డెన్మార్క్ జీడీపీతో సమానం కావడం విశేషం.
గ్రాసరీ డెలివరీ యాప్ జెప్టో వ్యవస్థాపకురాలు 21 ఏండ్ల కైవల్య.. ఈ జాబితాలో అతిపిన్న వయస్కురాలు. ఆ తర్వాత భారత్పే నుంచి శశ్వత్ నక్రాని (25), జుపీ నుంచి దిల్షర్ మల్హీ (27) ఉన్నారు. నైకాకు చెందిన ఫాల్గుని నాయర్.. జాబితాలోని మహిళా ఆంత్రప్రెన్యూర్స్లో టాప్లో ఉన్నారు. దేశంలోని 23 నగరాలకు చెందినవారికి ఈ జాబితాలో స్థానం దక్కగా, బెంగళూరు నుంచి అత్యధికంగా 129 మంది ఉన్నారు. ముంబై నుంచి 78 మంది, గురుగ్రామ్, ఢిల్లీ నుంచి 49 మందికి చోటు లభించింది. అయితే జాబితాలోని సంస్థల్లో 25 శాతం మాత్రమే స్టాక్ మార్కెట్లలో ఉన్నాయి.
ఇక మిల్లేనియంలో టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో 8.. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టినవే కావడం విశేషం. ఇక ఈ జాబితాలో పేరున్న 405 మంది వ్యవస్థాపకులు.. 2000వ సంవత్సరం నుంచి దేశంలో విలువైన సంస్థలను నెలకొల్పినవారే. వీరిలో 56 శాతం మంది ఇంజినీరింగ్, 10 శాతం మంది చార్టెడ్ అకౌంటెంట్లు, ఏడుగురు వైద్యులున్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందినవారు 38 మంది. ఐఐటీ ముంబైకి చెందినవారు 24, ఐఐటీ కాన్పూర్కు చెందినవారు 20 మంది ఉన్నారు.