న్యూఢిల్లీ, జూలై 9: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లాభాల్లో అదరహో అనిపించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఆరింతలు పెరిగి రూ.642.89 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.95.36 కోట్లుగా ఉన్నది. కంపెనీ విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 93.66 శాతం అధికమై రూ.10,038.07 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఏడాది ఇది రూ.5,183.12 కోట్లుగా ఉన్నది. గతేడాదిలో నమోదైన ఆర్థిక ఫలితాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని, కరోనా సెకండ్ వేవ్తో గడిచిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు భారీగా పడిపోయాయని అవెన్యూ సూపర్మార్ట్ సీఈవో, ఎండీ నెవిల్ నోరోన్హా తెలిపారు. గత త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు 81 శాతం పెరిగి రూ.9,191.79 కోట్లకు చేరుకున్నాయన్నారు. రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని గడిచిన మూడేండ్లలో కొత్తగా 110 స్టోర్లు ప్రారంభించినట్లు, ప్రస్తుతం ఈ స్టోర్లు అంచనావేసిన స్థాయిలో నడుస్తున్నాయన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ కొత్తగా 10 స్టోర్లు ప్రారంభించింది సంస్థ.