హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఐసీఎస్ఐ నినాదం ‘సత్యం వద, ధర్మం చర’ అద్భుతమని హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస స్వామి అన్నారు. సత్యం, ధర్మాన్ని అనుసరించి, ఆచరించి, బోధించాలని కంపెనీ సెక్రటరీలకు ఆయన పిలుపునిచ్చారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ)-దక్షిణ భారత ప్రాంతీయ కంపనీ సెక్రెటరీస్ (ఎస్ఐఆర్సీ) 46వ సమావేశాన్ని హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బేగంపేటలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన సత్యగౌర చంద్రదాసస్వామి కంపెనీ సెక్రటరీస్ని ఉద్దేశించి ప్రసంగించారు. వినయమే మొదటి పాఠంగా హిందూతాత్విక, మతగ్రంథాలు బోధించాయని గుర్తుచేశారు. పూర్వం గురుకులాశ్రమంలో శిష్యుడు గురువును గమనించి అతని కర్మల నుంచి నేర్చుకునేవాడని చెప్పారు. నిజాన్ని నిజాయితీగా చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా పఠిస్తున్నారని వెల్లడించారు. పలు అంశాల్లో స్వీయ అనుమతిని కలిగి ఉండాలని, తప్పుడు వ్యాఖ్యానాలతో భ్రమలో ఉండొద్దని, ఆచరించేవాటినే బోధించాలని కోరారు. కొవిడ్ తర్వాత కంపెనీ సెక్రటరీల అతిపెద్ద సమావేశం ఇదేనని ఐసీఎస్ఐ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర వీ దేశ్ పాండే అభివర్ణించారు. ఈ సంవత్సరం ఐసీఎస్ఐ థీమ్ ‘ప్రాధాన్య వృత్తి’ ఎంచుకొన్నామని, హైదరాబాద్లోని ఐసీఎస్ఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆర్బిట్రేషన్ ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కంపెనీ సెక్రటరీలు వాణిజ్య సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకొని, సాధన చేయడానికి ఉపయోగపడుతుందని ప్రకటించారు. ఇనిస్టిట్యూట్ కంపెనీ సెక్రటరీషిప్ కోర్సు అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అందిస్తుందని చెప్పారు.
పలు వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఐసీఎస్ఐ
పాలమూరు, శాతావాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీలతో జాబ్ ఓరియంటేషన్ కోర్సుల అంశాలపై ఐసీఎస్ఐ ఒప్పందం కుదుర్చుకున్నది. పాలమూరు వీసీ ప్రొఫెసర్ ఎల్వీ లక్ష్మీకాంత్రాథోడ్, శాతావాహన వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, మహాత్మాగాంధీ వీసీ కృష్ణారావు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపకరిస్తుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
20 ఆర్బిట్రేషన్ ఇనిస్టిట్యూషన్లు
దేశవ్యాప్తంగా త్వరలో 20 ఆర్బిట్రేషన్ ఇనిస్టిట్యూషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎస్ఐ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర వీ దేశ్పాండే ప్రకటించారు. దేశీయంగా కంపెనీ సెక్రటరీల కొరత తీవ్రస్థాయిలో ఉన్నదని, దీనిని తగ్గించడానికి ఐసీఎస్ఐ కృషి చేస్తున్నదని, దీంట్లో భాగంగానే కొత్తగా 20 ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.