న్యూఢిల్లీ, జూన్ 9: క్రిప్టోకరెన్సీలు ‘ఒక కరేబియన్ పైరేట్స్ ప్రపంచం’ లాంటివేనని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత్ నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. క్రిప్టోలకు ఎటువంటి కేంద్రీకృత రెగ్యులేటరీ అథారిటీ లేనందున, ఒక ప్రభుత్వ కరెన్సీగా దీనికి గుర్తింపు సైతం లభించనందున కరేబియన్ పైరేట్స్తో సమానమేనన్నారు. ‘రెగ్యులేటర్ లేకపోవడమంటే అది కరేబియన్ పైరేట్స్ ప్రపంచం లేదా విజేత అంతా దోచుకునే ప్రపంచం అవుతుందని’ అన్నారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన టెర్రా-లూనా క్రిప్టోకరెన్సీ గత నెలలో నిలువునా పతనంకావడాన్ని నాగేశ్వరన్ ప్రస్తావిస్తూ ఈ ఉదంతం మనకు చాలా ముఖ్యమైన కథ చెపుతున్నదన్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (డీఈఎఫ్ఐ), క్రిప్టో తదితర ఫిన్టెక్ ఆధారిత సాధనాల్ని ఆహ్వానించడంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానన్నారు. ప్రభుత్వాలు జారీచేసే కరెన్సీల్లా (ఫియట్ మనీ) క్రిప్టోకరెన్సీకి ఎటువంటి నిల్వ విలువ, విస్తృత ఆమోదం, యూనిట్ ఆఫ్ అకౌంట్ వంటి ప్రాథమిక లక్షణాలేవీ ఉండవని వివరించారు. క్రిప్టోకరెన్సీలపై జారీచేసిన చర్చాపత్రంపై ప్రస్తుతం కేంద్రం కసరత్తు చేస్తున్నదని, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్లతో సహా వివిధ సంస్థలు, భాగస్వాముల సూచనలు తీసుకుంటున్నదని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి కారణంగా పలు దేశాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, వాటితో పోలిస్తే మనం మెరుగ్గానే ఉన్నామని, ఆర్థిక సవాళ్లను తట్టుకునే స్థితిలో ఉన్నామని నాగేశ్వరన్ చెప్పారు. ద్రవ్యలోటు, ఆర్థికాభివృద్ధి, పేదలు, అల్పాదాయ కుటుంబాల జీవన వ్యయం తగ్గింపు, రూపాయి పతనాన్ని నిలువరించడం- ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వం సమతౌల్య చర్యల్ని తీసుకుంటున్నదన్నారు.