న్యూఢిల్లీ, నవంబర్ 15: బీజేపీ నేత జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సోమవారం క్రిప్టో ఫైనాన్స్పై చర్చించింది. గతకొద్ది నెలలుగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై మదుపరులు అమితాసక్తిని కనబరుస్తున్న నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ప్రస్తుతం దేశంలో క్రిప్టో కరెన్సీల వినియోగంపై పూర్తిగా నిషేధంగానీ, స్పష్టమైన రెగ్యులేషన్లుగానీ లేవు. ఈ క్రమంలోనే క్రిప్టో ఎక్సేంజీలు, బ్లాక్ చైన్-క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ ప్రతినిధులు, పరిశ్రమ సంఘాలు, విద్యావేత్తలతో పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధించడం కంటే క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీల నియంత్రణకు ఎక్కువమంది మొగ్గు చూపినట్లు సమాచారం. కమిటీకి తమ అభిప్రాయాలనూ సమర్పించినట్లు తెలుస్తున్నది. కాగా, క్రిప్టో కరెన్సీల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపిన నేపథ్యంలో తొలిసారిగా ఫైనాన్స్పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సమావేశం జరుపడం గమనార్హం. క్రిప్టో కరెన్సీల నిషేధంలో ఎన్నో సవాళ్లున్నాయని ఈ సందర్భంగా కమిటీలోని పలువురు కాంగ్రెస్ నేతలు పీటీఐతో అన్నారు. సమావేశానికి ముందు కమిటీ చైర్మన్ సిన్హా మాట్లాడుతూ క్రిప్టో అవకాశాలు, సవాళ్లపై చర్చ జరిపి రెగ్యులేటర్లు, విధానకర్తలకు దాని సారాంశం ఇవ్వనున్నట్లు చెప్పారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు దూరం గా ఉండాలంటూ బ్యాంకులను, తమ పర్యవేక్షణలోని ఇతర ఆర్థిక సంస్థలను ఏప్రిల్ 6, 2018న ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను గతేడాది మార్చి 4న సుప్రీం కోర్టు పక్కకు పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ డిజిటల్ కరెన్సీని తామే తెస్తే ఎలా ఉంటుందన్నదానిపై ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 5న అంతర్గత కమిటీని సైతం ఏర్పాటు చేసింది.