Crypto Tax | క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వ అభిమతం.. వైఖరి వెల్లడి కావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్నదా.. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపైనా, క్రిప్టో కరెన్సీతో నగదు బదిలీలపైనా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తామని బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా క్రిప్టో కరెన్సీలు పతనం అవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటనతో స్మాల్ ఇన్వెస్టర్లలో ఆలోచన మొదలైందని నోయిడా కేంద్రంగా పని చేస్తున్న క్రిప్టో కామెంటేటర్ విశాల్ గుప్తా చెప్పారు. క్రిప్టోల్లో పెట్టుబడులతో రిటర్న్స్ వస్తాయా? అని సందేహిస్తున్నారని చెప్పారు. కేంద్రం వైఖరిలో క్లారిటీ లేకపోవడంతో గత రెండు నెలలుగా స్మాల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పడిపోయాయి.
అయితే, మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత క్రిప్టో ట్రేడింగ్ వాల్యూమ్స్లో చెప్పుకోదగిన మార్పులేం చోటు చేసుకోలేదు. క్రిప్టోల ట్రేడింగ్ మీద కేంద్ర మంత్రి ప్రకటన ప్రభావం ఎలా ఉంటుందని అంచనా వేయడం ఇప్పటికిప్పుడు అంచనా వేయడం తొందరపాటవుతుందని బైయూ కాయిన్ సీఈవో శివమ్ థక్రాల్ అన్నారు. తమ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాల ఒత్తిడికి గురి కాలేదన్నారు.
ఇప్పటికైతే బడ్జెట్ ప్రకటనపై ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంటే కనిపిస్తున్నదని శివమ్ థక్రాల్ తెలిపారు. ఇండియన్ క్రిప్టో ఎకో సిస్టమ్ పరిధిలో ఇన్వెస్టర్లు, ఎంటర్ప్రైన్యూర్ల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రకటనలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు కాయిన్ బాక్స్లో బిట్ కాయిన్ సహా మెజారిటీ కాయిన్స్ లాభాల్లోనే ఉన్నాయి. బిట్ కాయిన్ 3.96 శాతం, ఎథీరియం 9.40 శాతం, సొలానా 18.58 శాతం, కార్డనో 3.79 శాతం లాభ పడ్డాయి.