న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశీ ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్.. సెనెగల్ దేశంలోని రాక్ ఫాస్పేట్ సంస్థలో 45 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. డీఏపీ ఎరువుల తయారీలో భారత్ స్వయంసమృద్ధి సాధించేందుకు ఈ కొనుగోలు దోహదపడుతుందని కోరమాండల్ బుధవారం ప్రకటించింది. సెనెగల్లోని బావోబాబ్ మైనింగ్ అండ్ కెమికల్స్ కార్పొరేషన్ (బీఎంసీసీ)లో 45 శాతం వాటాను రూ. 225 కోట్లకు కొనుగోలు చేయనుంది. కేంద్ర ఎరువులు, రసాయినాల మంత్రి మాన్సుఖ్ మాండవియా సమక్షంలో ఈ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి సెనగల్ ప్రభుత్వం నుంచి ఆమోదపత్రాన్ని బీఎంసీసీ అధికారులు కోరమాండల్ అధికారులకు అందించారు. సెనెగల్లో ఫాస్పేట్ మైనింగ్ చేసి, భారత్లో డీఏపీ ఉత్పత్తి చేస్తామని, 10 లక్షల టన్నుల డీఏపీ, ఎన్పీకే ఎరువుల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుందని మాండవియా చెప్పారు.