హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధస్సు సాఫ్ట్వేర్ వేదిక, సొల్యూషన్స్ కంపెనీ కోర్.ఏఐ హైదరాబాద్లో విస్తరణ బాట పట్టింది. నగరంలో తమ నూతన కార్యాలయాన్ని సోమవారం ఏర్పాటు చేసింది. 500 మంది సిబ్బంది సామర్థ్యాన్ని కలిగిన ఈ కార్యాలయాన్ని అరబిందో గెలాక్సీ టవర్లో అత్యాధునిక మౌలిక వసతులతో నెలకొల్పారు. సంస్థ గ్లోబల్ రిసెర్చ్ హబ్గా ఇది ఉంటుందని ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపక సీఈవో రాజ్ కోనేరు తెలిపారు. కన్వర్జేషనల్ ఏఐ టెక్నాలజీ పురోగతికీ కృషి చేస్తామన్నారు.
మరో 550 ఉద్యోగావకాశాలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సెంటర్ అభివృద్ధికి రూ.185 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనున్న కంపెనీ.. తమ ఉద్యోగుల సంఖ్యను 1,100 మందికి తీసుకెళ్లాలని యోచిస్తున్నది. ప్రస్తుతం దేశంలో సంస్థకు 450 మంది ఉద్యోగులుండగా, ఇందులో ఎక్కువ మంది హైదరాబాద్లోనే పనిచేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో మరో 100 మంది ఉన్నారు. ఈ క్రమంలో మరో 550 మందిని ఉద్యోగాల్లోకి సంస్థ తీసుకోనున్నది. వీరిలో దేశీయంగా 250 మందిని నియమించుకుంటామని చెప్తున్నది.
కన్వర్జేషనల్ ఏఐకి పెద్దపీట
కొత్త తరం టెక్నాలజీల్లో కన్వర్జేషనల్ ఏఐ దూసుకుపోతున్నది. తమ వ్యాపారాభివృద్ధికి, ముఖ్యంగా కరోనా తదనంతర పరిస్థితుల మధ్య వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న సంస్థలు ఈ కన్వర్జేషనల్ ఏఐకి పెద్దపీట వేస్తున్నాయని రాజ్ కోనేరు తెలిపారు. స్మార్ట్ అసిస్ట్, ఏజెంట్ అసిస్ట్, బ్యాంక్ అసిస్ట్, హెల్త్ అసిస్ట్, సెర్చ్ అసిస్ట్, వర్క్ అసిస్ట్, హెచ్ఆర్, ఐటీ అసిస్ట్ వంటి సేవలను ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా అందిస్తామని కొత్త కేంద్రం ప్రారంభం అనంతరం మాట్లాడుతూ రాజ్ కోనేరు చెప్పారు. ఇదిలావుంటే నిరుడు నవంబర్లో ఎన్విదియా, పీఎన్సీ, విస్తారా గ్రోత్ కంపెనీల నుంచి సుమారు 73.5 మిలియన్ డాలర్లను సిరీస్ సీ రౌండ్లో పెట్టుబడులుగా కోర్.ఏఐ అందుకోవడం విశేషం.
గచ్చిబౌలిలో కంట్రోల్-ఎస్ డాటా సెంటర్
హైదరాబాద్లో కొత్తగా మరో డాటా సెంటర్ అందుబాటులోకి రానున్నది. నగరం కేంద్రంగా ఏర్పాటైన కంట్రోల్-ఎస్ కంపెనీ.. దేశవ్యాప్తంగా డాటా సెంటర్ల నిర్వహణలో ప్రముఖంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం గచ్చిబౌలిలో తమ మూడో డాటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసింది. ఈ కొత్త డాటా సెంటర్ను హైపర్స్కేల్ డాటా సెంటర్గా నిర్మిస్తున్నారు. సుమారు 1,31,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 18 మెగావాట్ల విద్యుత్తుతో నడిచేలా తీసుకొస్తున్నారు. మొత్తం ఇక్కడ 1,600 ర్యాక్లుంటాయి. ఈ సందర్భంగా కంట్రోల్-ఎస్ కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న డాటా సెంటర్ మూడవదని, ఇది ఫోర్ రేటింగ్ కలిగిన హైపర్స్కేల్ డాటాగా ఉంటుందన్నారు. కొత్త డాటా సెంటర్ ఏర్పాటు వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తాయని, ఇక్కడి డాటా సెంటర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీలకు, దేశీయ వ్యాపార సంస్థలకు సేవలను అందిస్తామన్నారు. కొత్తగా నిర్మించే డాటా సెంటర్ను పర్యావరణ హితంగా నిర్మిస్తున్నామని, వర్షపునీటిని సంరక్షించడంతోపాటు నీటి పరిరక్షణకు ఆధునిక పద్ధతులను అవలంభిస్తున్నామని చెప్పారు. కాగితం, ప్లాస్టిక్ను చాలా తక్కువ సంఖ్యలో వినియోగించేలా డాటా సెంటర్లో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.