న్యూఢిల్లీ, జూన్ 12: వంటనూనెల విక్రయ సంస్థ పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో రూ.5 వేల కోట్ల నిర్వహాణ లాభం, రూ.50 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ పామ్ రంగంలో ఉన్న భారీ అవకాశాలే ఇందుకు కారణమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా రామ్దేవ్ తెలిపారు. 2022-23లో రూ.31,821.45 కోట్ల ఆదాయంపై రూ.886.44 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
దీంట్లో వంటనూనెలను విక్రయించడంతో రూ.25,253.33 కోట్లు రాగా, ఫుడ్-ఎఫ్ఎంసీజీ రంగం నుంచి రూ.6,218 కోట్లు సమకూరింది. కంపెనీకి వచ్చిన ఆదాయంలో ఫుడ్-ఎఫ్ఎంసీజీ వ్యాపారం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ఏడాది క్రితం 7 శాతంగా ఉన్న ఈ విభాగ వాటా గడిచిన ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి చేరుకున్నదన్నారు. దేశవ్యాప్తంగా సంస్థ 63,816 హెక్టార్లలో పామాయిల్ను పండిస్తున్నది. 2019లో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్..రుచీ సోయా ఇండస్ట్రీస్ను కొనుగోలు చేసింది.