Gold to E-Gold | బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి మహిళామణులకు ఎంతో ప్రీతి. ఏ కొద్ది వెసులుబాటు ఉన్నా.. డబ్బు దొరికినా పిసరంత బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆర్థిక రంగంలో అనిశ్చితి, డాలర్ ఒడిదొడుకులు, చమురు ధరల్లో హెచ్చు తగ్గులు వంటి అంశాలతో బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి సాధనంగా కూడా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇతర ఇన్వెస్ట్మెంట్ టూల్స్తో పోలిస్తే బంగారంపై పెట్టుబడి సురక్షితం అన్న భావన ఉంది.
ఫిజికల్ బంగారం కొనుగోలు చేయడానికి బదులు ఇతర రూపాల్లో కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగానే 2015లో పసిడి బాండ్లు మార్కెట్లోకి తెచ్చింది. డిజిటల్ గోల్డ్ కూడా ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంది. ఫిజికల్ గోల్డ్ కాకుండా ఇతర మార్గాల్లో బంగారం కొన్న వారికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహాలూ అందిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో బెనిఫిట్ ఆఫర్ చేసింది. ఫిజికల్ గోల్డ్ను ఈ-గోల్డ్గా మార్చేస్తే మూలధన లాభాల పన్ను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఫిజికల్ గోల్డ్ను ఈ-గోల్డ్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడంపై ఓ లుక్కేద్దాం..
ఫిజికల్ గోల్డ్ను ఈ-గోల్డ్గా ట్రాన్స్ఫర్ చేయాలని భావించే వారు.. డిపాజిటరీ సంస్థ లేదా ట్రేడింగ్ సభ్యుడి దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇందుకు ఫొటో, ఐడెంటిటీ కాఆర్డు, ఆదాయం, బ్యాంకు అకౌంట్, చిరునామా ధృవపత్రాలు సమర్పించాలి. ఇక స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ అనుమతి గల డెలివరీ కేంద్రంలో వాల్ట్ మేనేజర్కు మీ దగ్గర గల బంగారం బార్ లేదా నాణెం డిపాజిట్ చేయాలి. అటుపై వాల్ట్ మేనేజర్.. మీరు ఇచ్చిన బంగారం ప్యూరిటీ నిర్ధారించి ధర ఖరారు చేస్తారు.
మీ బంగారం విలువకు సమానమైన ఎలక్ట్రానిక గోల్డ్ రిసిప్ట్ (ఈజీఆర్) సృష్టిస్తారు వాల్ట్ మేనేజర్.ఈ సమాచారాన్ని డిపాజిటరీ సంస్థలు, స్టాక్ ఎక్సేంజ్లు, వాల్ట్ మేనేజర్లు, సీసీఐఎల్కు అందుబాటులో గల ఉమ్మడి ప్లాట్ఫామ్పై షేర చేస్తారు.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ జారీ చేసిన అంతర్జాతీయ భద్రతా గుర్తింపు కార్డు నంబర్ను ఈజీఆర్కు మేనేజర్ కేటాయిస్తారు. అప్పుడు దానిపై స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి వీలు కలుగుతుంది.
ఈజీఆర్ ఓనర్ మారినట్లు స్టాక్ ఎక్సేంజ్, డిపాజిటరీ సంస్థలకు సీసీఐఎల్ తెలుపుతుంది. తద్వారా ట్రేడింగ్ కోసం ఎక్సేంజ్లో లిస్ట్ అవుతుంది. ఇలాగే డిపాజిటరీ సంస్థలకు అభ్యర్థన పంపి ఈజీఆర్లనూ ఫిజికల్ గోల్డ్గా మార్చేసుకోవచ్చు. ఈ మేరకు వాల్ట్ మేనేజర్కు దరఖాస్తు పంపి, సంబంధిత వ్యక్తికి అవసరమైన ఫిజికల్ గోల్డ్ అందించేలా డిపాజిటరీ సంస్థలు చర్యలు తీసుకుంటాయి.
ఈజీఆర్లు కూడా స్టాక్ మార్కెట్లో షేర్ల వంటివే. వీటిని డీమ్యాట్ ఖాతాలో పెట్టుకుని స్టాక్ ఎక్సేంజ్ల్లో ట్రేడింగ్ జరుపుకోవచ్చు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో షేర్ల ట్రేడింగ్ మాదిరిగానే ఈజీఆర్ల ట్రేడింగ్కు వీలుగా గోల్డ్ ఎక్సేంజ్ ఏర్పాటుకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. గతేడాది దీపావళి నాడు జరిగిన మూరత్ ట్రేడింగ్ తర్వాత బీఎస్ఈ కూడా సెబీ నిబంధనలకు అనుగుణంగా ఈజీఈర్లు ఆఫర్ చేస్తున్నది.
జ్యువెల్లరీ, నాణాలు, బార్ల రూపంలో గల బంగారం 10 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు సెబీ అనుమతి గల డెలివరీ కేంద్రాల్లో డిపాజిట్ చేసి ఈజీఆర్లుగా మార్చుకోవచ్చు. డిపాజిట్కు అనుగుణంగా ఇంట్లో ఉన్న పాత బంగారం, నాణాలను బులియన్లోకి మార్చుకోవచ్చు.
ఈజీఆర్లు రెండు రకాలు. ఒకటి 99.5 ప్యూరిటీ, మరొకటి 99.9 ప్యూరిటీ. ఇన్వెస్టర్లు వీటిని తమ వద్ద కావల్సినన్ని రోజులు ఉంచుకోవచ్చు. అవసరం అనుకున్నప్పుడు ఈజీఆర్లు డిపాజిట్ చేసి అవి విలువ చేసే బంగారం వాల్ట్ నుంచి ఫిజికల్ గోల్డ్గా మార్చుకోవచ్చు.
ఒక ప్రాంతంలో వాల్ట్ మేనేజర్ వద్ద డిపాజిట్ చేసిన బంగారం.. ఇతర ప్రాంతాల్లోని అదే వాల్ట్ మేనేజర్ వద్ద కూడా తీసుకోవచ్చు. ఈజీఆర్ సమర్పించాక వచ్చే ఫిజికల్ గోల్డ్ను డెలివరీ ఫీజు పే చేసి, నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు.