కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ, ఆధునిక వైద్యశాస్ర్తాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. మొదటి, రెండో దశ కరోనా వ్యాప్తితో కోట్ల మందిని రోగగ్రస్థులను చేస్తూ, లక్షల మంది ప్రాణాలను బలిగొంటూ, వైద్య విజ్ఞానానికి సవాలు విసురుతున్నది. నిన్న మొన్నటిదాకా సంజీవని అన్న రెమ్డెసివిర్ ప్రాణాంతకమని, బ్లాక్ వైరస్ రాకకు అదే కారకమని తెలియవస్తున్నది. వైరస్ కట్టడికి స్థిరమైన, విశ్వసనీయమైన ఔషధం ఇదీ అంటూ చెప్పలేని అసహాయతలో, అనిశ్చితిలో స్థానిక, సంప్రదాయ విధానాల అనుసరణ ఆవశ్యంగా, అనివార్యంగా ముందుకువస్తున్నది. సంప్రదాయ చికిత్సా విధానాల్లోంచి ప్రత్యామ్నాయ ఔషధం ఏదైనా ముందుకు వచ్చినప్పుడల్లా అల్లోపతి సమర్థకులంతా దాని శాస్త్రీయత ఎంత అనే ప్రశ్న లేవనెత్తటం పరిపాటి అవుతున్నది. ఈ పరిస్థితుల్లోంచే కృష్ణపట్నం ప్రత్యామ్నాయ ఔషధం వంటివి జన జీవితానుభవాల్లోంచి వెలుగులోకి వస్తుండటం గమనార్హం.
మన దేశంలో ఆయుర్వేదం అతి పురాతనమైన వేల ఏండ్ల చరిత్ర కలిగిన వైద్యవిధానం. అధర్వణ వేదానికి ఉపవేదంగా తరతరాలుగా వైద్యసేవలు అందిస్తున్నది. చరకుడు, సుశ్రుతుడు మొదలు ధన్వంతరి దాకా ఎంతో మంది ఇక్కడ లభ్యమయ్యే వనమూలికలతో ఆయుర్వేదాన్ని వృద్ధి చేశారు. ఈ వైద్య విధానం ఎన్నో దీర్ఘకాలిక, భయంకర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించింది. పెరట్లోనో, పొలం గట్టుమీదనో, ఇంటిముందటో దొరికే, పలు వ్యాధులను తగ్గించే ఆకు పసరు అశాస్త్రీయం అయితే, కొన్ని రసాయనాలు, సుద్దపిండితో కంపెనీలో తయారై భారీ ధరకు దొరికే మందు బిళ్ల మాత్రం శాస్త్రీయం ఎందుకవుతుందనే ప్రశ్న ఎప్పుడూ ఉంది. ప్రకృతిలో ఉచితంగా దొరికేది అశాస్త్రీయం, పైసలు పెట్టి మార్కెట్లో కొనేదే శాస్త్రీయం అవుతుందా? అనే చర్చ దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నది.
కరోనా రెచ్చిపోతున్న నేపథ్యంలో అనేక దేశాల్లో స్థానిక సంప్రదాయ వైద్య విధానాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. చైనాలో ‘సాంప్రదాయ చైనా ఔషధం’ (టీసీఎం) పేర మూలికా ఔషధాల వినియోగంతో వైరస్ను నియంత్రించగలిగినట్లు తెలుస్తున్నది. అలాగే క్యూబా, జపాన్, కొరియా, వియత్నాం లాంటి దేశాలు తమదైన స్థానిక వైద్య విధానాల మేలుకలయికతో కొవిడ్ను కట్టడి చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. నిజానికి రోగం గానీ, దానికి అవలంబించే చికిత్స గానీ స్థానిక భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అతీతంగా ఉండదు, ఉండకూడదని శాస్త్రీయ చికిత్సా విధానం చెప్తున్నది. ఇప్పటికైనా పాశ్చాత్య అనుకరణ మూసపద్ధతికి సహేతుకమైన, శాస్త్రీయమైన సంప్రదాయక ఔషధాలను గుర్తించాలి, గౌరవించాలి. స్థానిక పరిస్థితులకు అనుగు ణంగా కరోనా రూపు మారుస్తున్నందున స్థానిక చికిత్సలకు ప్రాధా న్యం ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో నిపుణులు పరిశీలించాలి. మహమ్మారితో పోరాటంలో అన్ని అస్ర్తాలను వాడినప్పుడే విజయం సాధ్యం. అంతిమంగా రోగాన్ని తగ్గించేదే మందు!