NPS Benefits | ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రతియేటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. 60 ఏండ్ల తర్వాత రిటైర్మెంట్ అవుతారు. ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు ఒకవైపు.. తగ్గుతున్న ఆదాయాలు మరోవైపు. ఈ తరుణంలో రిటైర్మెంట్ తర్వాత సాఫీగా కుటుంబ జీవనం సాగించాలంటే ఉద్యోగ వర్గాలకు మెరుగైన ఆప్షన్గా నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) అందుబాటులో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను పొదుపు చేయాలంటే వచ్చే నెలాఖరుతో గడువు ముగుస్తుంది. పన్ను ఆదా చేయడంతోపాటు రిటైర్మెంట్ ప్లానింగ్కి పక్కాగా ఉపకరించే స్కీం.. ఎన్పీఎస్.. దాని గురించి తెలుసుకుందామా..!
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో రెండు రకాల అకౌంట్లు ఉన్నాయి. టైర్-1 ఖాతాలో చేరిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిధులు పొదుపు చేయడంతోపాటు దీనికి లాక్ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే నిర్ధిష్ట పీరియడ్ వరకు ఈ పథకంలో పెట్టుబడులను విత్ డ్రా చేసుకునే వీలు ఉండదు. పన్ను ఆదా చేయొచ్చు కూడా.
ఇక టైర్-2 ఖాతాలో డబ్బు పొదుపు చేయాలనే నిబంధనేం లేదు. ఈ ఖాతాలో పొదుపు చేసిన వారు ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు గానీ, పన్ను రాయితీ ఉండదు. ఎన్పీఎస్ అకౌంట్లో డబ్బు పొదుపు చేసేవారు ఆదాయం పన్ను చట్టంలోని 80 సీసీడీ (1) సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీ క్లయిమ్ చేయొచ్చు. 80సీసీడీ (1) సెక్షన్తోపాటు 80సీసీసీ, 80సీ సెక్షన్ల ద్వారా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీ పొందొచ్చు.
పెన్షన్ ఫండ్లకు 80సీసీసీ సెక్షన్ వర్తిస్తుంది. ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన పథకాలకు 80సీసీడీ సెక్షన్ వర్తిస్తుంది. అత్యధికులు పీపీఎఫ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, తమ పిల్లల ట్యూషన్ ఫీజులు చూపి రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీ పొందుతారు. ఎన్పీఎస్ కింద అదనంగా రూ.50 వేల వరకు పన్ను రాయితీ పొందడానికి 80సీసీడీ (1బీ) సెక్షన్ ఉపయోగించుకోవచ్చు.
ఎన్పీఎస్ ఖాతాలో ఆ ఉద్యోగి పని చేస్తున్న సంస్థ నిధులు జమ చేసే ఫండ్ మీద ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ సెక్షన్ కింద పన్ను రాయితీ పొందొచ్చు. కంపెనీలు సంబంధిత ఉద్యోగుల ఎన్పీఎస్ ఖాతాలో జమ చేసే ఫండ్ని తొలుత ఆ వ్యక్తి వేతనంలో కలుపుతారు. తత్ఫలితంగా కనీస వేతనం, డీఏపై ప్రభుత్వోద్యోగులు 14 శాతం, ప్రైవేట్ ఉద్యోగులు 10 శాతం పన్ను రాయితీ క్లయిమ్ చేయవచ్చు.
ఇంతకుముందు కంపెనీ తమ ఉద్యోగుల ఎన్పీఎస్ ఖాతాలో జమ చేసే మొత్తం నిధులపై 80సీసీడీ సెక్షన్ కింద పన్ను రాయితీ పొందడానికి లిమిట్ ఉండేది కాదు. సంస్థ డిపాజిట్ చేసిన మొత్తం, కనీస వేతనం, డీఏపై 14 శాతం వరకు పన్ను రాయితీ పొందడానికి చాన్స్ ఉంది. అయితే, ఎక్కువ శాలరీ అందుకుంటున్న వారు భారీగా పన్ను మినహాయింపు పొందుతున్నారన్న కోణంలో 2020లో మార్పు చేశారు. దీని ప్రకారం ఒక ఉద్యోగి ఎన్పీఎస్ రిటైర్మెంట్ ఫండ్ ఖాతాలో కంపెనీలు డిపాజిట్ చేసే మొత్తం రూ.7.5 లక్షలు దాటితే.. మిగిలిన మొత్తంపై సదరు ఉద్యోగి టాక్స్ పే చేయాలి.. అంటే రూ.7.5 లక్షలు దాటిన పొదుపుపై వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది.ఇక స్వయం ఉపాధి కింద జీవనం సాగించే వారు కూడా ఎన్పీఎస్ కింద ఐటీ మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. అదనంగా 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద కూడా రూ.50 వేలు రాయితీ అందుకోవచ్చు.
రిటైర్మెంట్ టైంలో ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లు.. తమ అకౌంట్లలో డిపాజిట్ చేసిన ఫండ్స్లో 60 శాతం దాకా విత్ డ్రా చేయవచ్చు. దీనిపై ఎటువంటి పన్ను వర్తించదు. మిగతా 40 శాతం ఫండ్స్తో యాన్యుటీ ప్లాన్ కొనుక్కోవచ్చు. ఈ యాన్యుటీ ప్లాన్ ద్వారా పొందే పెన్షన్ మొత్తం ఆదాయంలో కలిపితే వర్తించే టాక్స్ శ్లాబ్ కింద పన్ను పే చేయాలి. ఒకవేళ మధ్యలో పాక్షికంగా విత్ డ్రా చేసుకుంటే మొత్తం ఎన్పీఎస్ ఖాతా నిధుల్లో 25 శాతం వరకు ఉంటే పన్ను రాయితీ ఉంటుంది. అంతకు మించి విత్ డ్రా చేసినట్లయితే ఆ పన్ను శ్లాబ్ కింద టాక్స్ పే చేయాల్సిందే.