Coal shortage | దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే బొగ్గు కొరత ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా సోమవారం విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలతో సమావేశమయ్యారు. దేశంలో బొగ్గు నిల్వలపై చర్చించారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎన్టీపీసీ అధికారులు కూడా పాల్గొన్నారని సమాచారం.
దేశంలోని 135 బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో సగానికి పైగా ప్లాంట్లలో నిల్వలు మూడు రోజులలోపు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు మాత్రమే ఉందని సమాచారం. ఈ విద్యుత్ కేంద్రాలే దేశానికి అవసరమైన 70 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరలు పెరగడం, కరోనా లాక్డౌన్తో డిమాండ్కు అనుగుణంగా బొగ్గు సరఫరాలో అంతరాయం వంటి అంశాలు దీనికి కారణమని తెలుస్తున్నది. ఈ నెల 8న విద్యుత్ వినియోగం 3,900 మెగాయూనిట్లు. ఈ నెల తొలి 9 రోజుల్లో ఇదే అత్యధికం. పంజాబ్తోపాటు జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
పరిమితంగా బొగ్గు లభ్యత ఉన్న నేపథ్యంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2-6 గంటల మధ్య విద్యుత్ సరఫరా చాలా కీలకం. కనుక విద్యుత్ వినియోగదారులు విద్యుత్ వాడకంలో ఆచితూచి స్పందించాలని అని ఢిల్లీలో విద్యుత్ సరఫరా చేస్తున్న టాటా పవర్ అనుబంధ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కోరడం గమనార్హం.