న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కోల్ ఇండియా నికరలాభం 2023 డిసెంబర్ త్రైమాసికంలో 17 శాతం వృద్ధిచెంది రూ. 9,069 కోట్లకు చేరింది. కోల్ ఇండియా మార్కెట్లో లిస్టయిన తర్వాత ఒక త్రైమాసికంలో ఇంత లాభాన్ని సంపాదించడం ఇదే ప్రధమం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలానికి రూ.7,755 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 3 శాతం వృద్ధిచెంది రూ.35,169 కోట్ల నుంచి రూ.36,154 కోట్లకు చేరింది.
ముగిసిన త్రైమాసికంలో బొగ్గు ఉత్పత్తి 11 శాతం పెరిగి 19.9 కోట్ల టన్నులుగా నమోదయ్యింది. సోమవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ను సిఫార్సుచేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ మొత్తం డివిడెండ్ రూ.20.50కి చేరింది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో)గా ముకేశ్ అగర్వాల్ నియామకాన్ని బోర్డు ఆమోదించింది.