CNG Bike | న్యూఢిల్లీ, నవంబర్ 22: పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్విచక్ర వాహన వినియోగదారులకు త్వరలో శుభవార్త రాబోతున్నది. ప్రస్తుతం కార్లకే పరిమితమైన సీఎన్జీ..భవిష్యత్తులో ద్విచక్ర వాహనాల్లో కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ బజాజ్ ఆటో ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించింది. ప్రస్తుతం సీఎన్జీ ద్విచక్ర వాహనాలు ప్రారంభ దశలో ఉన్నాయని, 2025 నాటికి ఈ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్టు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సీఎన్జీ ద్విచక్ర వాహనాలు లేవని ఒక ప్రైవేట్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
రెగ్యులేషన్ సమస్యలు అధికం..
ద్విచక్ర వాహన పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, మరీ ముఖ్యంగా రెగ్యులేషన్, పన్నులకు సంబంధించి అధిక సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన విమర్శించారు. మరోవైపు, ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో మూడు చక్రాల వాహన పరిశ్రమలో 60 శాతం సీఎన్జీకి మారిపోయారని చెప్పారు. కరోనా ముందు స్థాయికి వాహన విక్రయాలు ఇంకా చేరుకోలేదన్న ఆయన..ఇటీవల కాలంలో ద్విచక్ర వాహన అమ్మకాలు పుంజుకుంటున్నాయన్నారు. మరోవైపు, ప్రస్తుతం ట్రయింఫ్ వాహనాలు నెలకు 10 వేల యూనిట్లు ఉత్పత్తి అవుతుండగా, డిసెంబర్ నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 18 వేల యూనిట్లకు పెంచుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందుకోసం పుణెలోని ఛకాన్ ప్లాంట్లో రూ.200 కోట్లతో నూతన ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.