హైదరాబాద్, నవంబర్ 22: గంగాజల్ ఆపుర్తి యోజన కింద బీహార్లోని బోధ్గయా, గయా, రాజ్గిర్ నగరాలకు ఈ నెలలోనే సురక్షిత మంచి నీటి సరఫరాను ప్రారంభించబోతున్నట్టు మేఘా ఇంజినీరింగ్ మంగళవారం తెలిపింది. దీంతో ఈ మూడు నగరాల్లోని దాదాపు 7.5 లక్షల మందికి, యాత్రికులు, పర్యాటకులకు ఈ ప్రాజెక్టు తొలి దశ ద్వారా త్రాగునీరు అందబోతున్నట్టు మేఘా ప్రకటించింది. కాగా, జల్ జీవన్ హరియాలీ మిషన్లో భాగంగా గంగాజల్ ఆపుర్తి యోజనను ఈ నెల 27న రాజ్గిర్లో, 28న గయా, బోధ్గయాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభిస్తారని సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది.