బీజింగ్, ఆగస్టు 18: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే.. దివాలా తీసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. 340 బిలియన్ డాలర్ల (రూ.28.22 లక్షల కోట్లు) రుణ భారం నుంచి తప్పించుకోవడంలో భాగంగా న్యాయస్థానంలో దివాలా పిటిషన్ను కూడా వేసిందన్న న్యూస్ అన్ని ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అమెరికా కోర్టును అందుకే కంపెనీ ఆశ్రయించిదని అంతా పేర్కొన్నారు. అయితే వీటన్నింటిని శుక్రవారం సదరు సంస్థ కొట్టిపారేసింది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఆమోదించుకునేందుకే గురువారం అమెరికా కోర్టుకు వెళ్లినట్టు ఎవర్గ్రాండే స్పష్టం చేసింది. విదేశీ బాండ్హోల్డర్స్ కోసం తమ డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ను ఆమోదించాలని కోర్టును అడుగుతున్నట్టు వివరించింది. నిజానికి తమకున్న అప్పులు.. తమ ఆస్తుల కంటే చాలా తక్కువేనని, రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న మందగమనం వల్లే రుణదాతలకు అప్పులు తిరిగి చెల్లించడంలో ఆలస్యమవుతుందని కంపెనీ ఈ సందర్భంగా చెప్పింది.
2021 నుంచే ఎవర్గ్రాండే గ్రూప్ రుణ భారం భయపెడుతున్నది. కొండలా పేరుకుపోయిన అప్పుల కుప్పతో ఎప్పటికైనా ముప్పేనన్న సంకేతాలు గడిచిన రెండేండ్ల నుంచే వస్తున్నాయి. కాగా, ఎవర్గ్రాండే దివాలా తీస్తే.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆ ప్రకంపనలు స్పష్టంగా ఉంటాయన్న అంచనాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్లు చేతులెత్తేయడంతో ఆ ప్రభావం గ్లోబల్ ఎకానమీపై పడింది. ఇప్పుడు ఎవర్గ్రాండే కూడా దివాలా తీస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దెబ్బతింటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నమొన్నటిదాకా కరోనా కారణంగా క్షీణించిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. దానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అడ్డుపడుతుండగా.. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల బెడద బోనస్గా వచ్చి చేరింది. ఈ పరిస్థితుల్లో ఎవర్గ్రాండే సంక్షోభాన్ని అంత తేలిగ్గా తీసుకోలేమని గ్లోబల్ మార్కెట్ వర్గాలు తాజా పరిస్థితుల్ని విశ్లేషిస్తున్నాయి. రుణ భారం మీతిమీరిపోవడంతో 2020లో చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. కంపెనీకి మరిన్ని కరెన్సీ కష్టాల్ని తెచ్చిపెట్టాయి.
ఎవర్గ్రాండే సంక్షోభం నేపథ్యంలో మదుపరుల్లో విశ్వాసం నింపేందుకు చైనా ప్రభుత్వం రంగంలోకి దిగింది. సమస్యలన్నీ కొలిక్కి వస్తాయని, డెట్ మార్కెట్ కార్యకలాపాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదంటున్నది. ఈ క్రమంలోనే అమెరికా దివాలా చట్టంలోని చాప్టర్ 15.. విదేశీ రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఓ సాధారణ సెక్షనేగానీ, దివాలా పిటిషన్ దాఖలుకు కాదని హాంకాంగ్లో ఎవర్గ్రాండే ఇచ్చిన ప్రకటనను ప్రస్తావిస్తున్నది. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్తున్నది. కాగా, హాంకాంగ్, బ్రిటిష్ వర్జిన్ ఐస్లాండ్స్ న్యాయ వ్యవస్థలను అనుసరించి అమెరికా డాలర్ బాండ్ల మదుపరులతో ఎవర్గ్రాండే సంప్రదింపులు జరుపుతున్నది. అయితే ఈ అంశం న్యూయార్క్ సిటీలోని దివాలా కోర్టు పరిధితో ముడిపడి ఉన్నందున, దాని ఆమోదం అవసరమని కంపెనీ చెప్తున్నది. మరోవైపు ఎవర్గ్రాండే వ్యవహారం ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలనూ ప్రభావితం చేస్తున్నది. ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతున్నాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ సంక్షోభానికి తెరపడకపోతే నష్ట తీవ్రత భారీగానే ఉంటుందన్న భయాలను వెలిబుచ్చుతున్నారు.