బీజింగ్: చైనా సొంత డిజిటల్ కరెన్సీని చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సొంత కరెన్సీపై చైనా సెంట్రల్ బ్యాంక్ టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. డిజిటల్ యువాన్తో బిట్ కాయిన్ పోటీ పడుతుందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయని విశ్లేషకుల కథనం. అలాగే బిట్ కాయిన్ మైనింగ్.. పారిశ్రామిక, ఆర్థిక వాతావరణాన్ని దెబ్బ తీస్తుందేమోనని ప్రభుత్వం అనుమానిస్తున్నది.
50 శాతానికి పైగా బిట్ కాయిన్ మైనింగ్ చైనాలోనే జరుగుతున్నది. బిట్ కాయిన్ మైనింగ్, ట్రేడింగ్పై చైనా సెంట్రల్ బ్యాంక్, ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
పలువురు బిట్ కాయిన్ మైనింగ్ సంస్థల యజమానులు అమెరికాలోని టెక్సాస్ లేదా కజకిస్థాన్లలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ యంత్రాలను తుక్కు కింద అమ్మేస్తున్నట్లు సిచువాన్లోని క్రిప్టో మైనింగ్ ఆపరేటర్ మైక్ హువాంగ్ చెప్పారు. తాము ప్రభుత్వ విధానాలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.
బిట్ కాయిన్పై నిషేధం విధించాక ఇన్నర్ మంగోలియా, జిన్జియాంగ్, యున్నాన్, సిచువాన్ ప్రాంతాల్లోని క్రిప్టో కరెన్సీ మైనింగ్ హబ్స్.. ఈ బిజినెస్ నుంచి బయటకు వచ్చేందుకు చర్యలు చేపట్టాయి.
జింగ్ జియాంగ్ తర్వాత చైనాలో సిచువాన్లోనే క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మైనింగ్ జరుగుతున్నది. క్రిప్టో కరెన్సీ.. ఎకానమీ ఆర్డర్ను డిస్ట్రబ్ చేస్తాయని చైనా ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. అక్రమాస్తుల బదిలీ, మనీ లాండరింగ్ లావాదేవీలకు బిట్ కాయిన్లను వినియోగిస్తున్నారన్నారు.
గత ఏప్రిల్లో ఆల్టైం రికార్డు నమోదు చేసిన బిట్ కాయిన్.. ఈ వారంలో 30 వేల డాలర్ల డిగువకు పడిపోయింది. క్రిప్టో కరెన్సీల మైనింగ్ను ప్రభుత్వం అనుమతించకపోతే.. ఆ బిజినెస్ నుంచి బయటకు వచ్చేస్తామని పలువురు మైనింగ్ ప్రాజెక్ట్ ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు.