న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఈ-కామర్స్ వేదికలపై ‘డార్క్ ప్యాటర్న్స్’ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వినియోగదారుల ప్రయోజనాల రక్షణార్థం సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ‘డార్క్ ప్యాటర్న్స్ నియంత్రణ, నిరోధక మార్గదర్శకాలు’ పేరిట ఓ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ డార్క్ ప్యాటర్న్స్తో కస్టమర్లను మోసం చేస్తూ, కొనుగోలుపరమైన అంశాల్లో వారికున్న స్వేచ్ఛను ఈ-కామర్స్ సంస్థలు దెబ్బ తీస్తున్నాయని సీసీపీఏ ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్కొన్నది. బలవంతంగా కొన్నింటిని కస్టమర్లకు అంటగట్టి, తద్వారా అక్రమార్జనకు తెగబడుతున్నారనీ ఆక్షేపించింది. కాగా, తమ ఈ మార్గదర్శకాలు.. దేశంలో వస్తూత్పత్తులు, సేవలను అందించే అన్ని ఈ-కామర్స్ వేదికలకు వర్తిస్తాయని ఈ సందర్భంగా సీసీపీఏ తెలిపింది. చివరకు ప్రకటనదారులు, విక్రయదారులకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.
డార్క్ ప్యాటర్న్స్ అంటే?
యూజర్ ఇంటర్ఫేస్ లేదా యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్స్ వాడుతూ మోసపూరితంగా రూపొందించే ప్యాటర్న్లనే డార్క్ ప్యాటర్న్స్గా నోటిఫికేషన్లో సీసీపీఏ అభివర్ణించింది. ఈ డార్క్ ప్యాటర్న్స్ లక్ష్యం.. షాపింగ్ చేస్తున్న కస్టమర్లకు అవసరం లేకున్నా రకరకాల వస్తూత్పత్తులను అంటగట్టి బిల్లులను ఎక్కువ చేయించడమే. ఉదాహరణకు ‘బాస్కెట్ స్నీకింగ్’. దీనిద్వారా ఏదైనా ఈ-కామర్స్ వెబ్సైట్కు వెళ్లి షాపింగ్ చేసి అంతా ముగించుకుంటున్న సమయంలో ప్రోడక్ట్స్, సర్వీసెస్, పేమెంట్స్ వంటి అదనపు లింకులతో కస్టమర్ల జేబుల్ని ఖాళీ చేస్తున్నారు. అలాగే ‘ఫోర్స్ యాక్షన్’ అనే మరో డార్క్ ప్యాటర్న్తోనూ అదనపు ఉత్పత్తుల్ని కొనేలా, సేవల్ని వినియోగించుకునేలా ఈ-కామర్స్ సంస్థలు ఒత్తిడి తెస్తున్నట్టు సీసీపీఏ గుర్తించింది. వస్తూత్పత్తుల్ని కొనేటప్పుడు కస్టమర్ల విలువైన సమాచారాన్ని సేకరించి దుర్వినియోగపరుస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి.
ఇక జరిమానాలే..
డార్క్ ప్యాటర్న్స్తో ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు.. కస్టమర్ల హక్కుల్ని కాలరాస్తున్నాయని సీసీపీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ రకమైన చర్యలకు పాల్పడితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద జరిమానాలు వేస్తామని హెచ్చరిస్తున్నది. కాగా, ఇప్పుడు 13 డార్క్ ప్యాటర్న్స్ ఉన్నట్టు సీసీపీఏ గుర్తించింది. మొదట్లో పదే అనుకున్నా.. కస్టమర్ల ఫిర్యాదుల ద్వారా మరో 3 వెలుగుచూశాయి.