న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: గత నెల మార్చిలో ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ (ఐసీఐ)లో ఉత్పాదకత భారీగా పడిపోయింది. సోమవారం వెల్లడైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. బొగ్గు, ముడి చమురు, ఎరువుల రంగాల పనితీరు పెద్ద ఎత్తునే మందగించింది. దీంతో 8 కీలక రంగాల్లో ఓవరాల్గా ఉత్పత్తి రేటు 0.4 శాతానికి పరిమితమైంది. ఇది గడిచిన 19 నెలల్లోనే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 2024 ఆగస్టు తర్వాత ఇదే. ఉక్కు, సిమెంట్, రిఫైనరీ ఉత్పత్తుల తయారీ సైతం ఆకర్షణీయంగా లేదు.
సహజ వాయువు ఉత్పత్తి పెరిగినా.. గడిచిన 5 నెలల్లో తొలిసారి పతనం తప్పలేదు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 8 కీలక రంగాల వృద్ధిరేటు 2.8 శాతంగా ఉన్నది. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఈ రంగాల్లో ప్రగతి 2.6 శాతంగా రికాైర్డెంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) 4.5 శాతంగా ఉండటం గమనార్హం.
మార్చిలో బొగ్గు ఉత్పత్తి 4 శాతం, ముడి చమురు 5.7 శాతం, ఎరువులు 24.6 శాతం, విద్యుత్తు 0.5 శాతం చొప్పున పడిపోయింది. అలాగే రిఫైనరీ ఉత్పత్తుల తయారీలో వృద్ధి 0.1 శాతం, ఉక్కు 2.2 శాతం, సిమెంట్ 4 శాతానికి పరిమితమైంది. అత్యధికంగా సహజ వాయువు ఉత్పాదకత 6.4 శాతం పెరిగింది. కాగా, ఐసీఐ వాటా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ)లో 40 శాతంగా ఉంటుంది. ఈ క్రమంలో రాబోయే ఐఐపీ గణాంకాల్లో పతనం తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చికిగాను విడుదలయ్యే పారిశ్రామికోత్పత్తి సూచీ దాదాపు 1-2 శాతం మందగించవచ్చని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ అంటున్నారు. ఫిబ్రవరిలో 5.2 శాతం వృద్ధి ఉన్నట్టు గుర్తుచేశారు.