Apple-iPhone | ఆపిల్ ఉత్పత్తులు వాడే వినియోగదారులకు కేంద్రం సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. ఐ-ఫోన్, మ్యాక్స్ బుక్, ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్ సెట్లకు ‘హై-రిస్క్’ ముప్పు ఉందని హెచ్చరించింది. వీటిల్లో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్’ లో క్లిష్టమైన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్)’ తెలిపింది.
హ్యాకర్లు ఈ లోపాన్ని ఉపయోగించుకుని ఏకపక్షంగా కోడ్ ఎగ్జిక్యూట్ చేసి.. యూజర్ల వద్ద ఉన్న ఆపిల్ ఉత్పత్తులను రిమోట్గా ఆపరేట్ చేసే ప్రమాదం ఉందని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. కనుక ఆపిల్ ఉత్పత్తుల యూజర్లు తమ వద్ద ఉన్న డివైజ్లను లేటెస్ట్ సెక్యూరిటీ వర్షన్తో అప్ డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్ 17.4.1, 16.7.7 కంటే ముందు వర్షన్లు, సఫారీ 17.4.1, మ్యాక్స్ ఓఎస్ వెంట్యూరా 13.6.6, మ్యాక్ఓఎస్ సొనోమా 14.4.1, ఆపిల్ విజన్ ఓఎస్ 1.1.1 కంటే ముందు వర్షన్లలో ఈ లోపాలు గుర్తించామని సెర్ట్-ఇన్ తెలిపింది.
అలాగే 17.4.1 కంటే ముందు ఓఎస్ వాడే ఐఫోన్ ఎక్స్ ప్రెస్, ఐపాడ్ 12.9, 10.5, 11 అంగుళాల ఐపాడ్ ఎయిర్ ఐపాడ్ మినీ యూజర్లకు ఈ సెక్యూరిటీ ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ జారీ చేసిన అలర్ట్ అడ్వైజరీలో తెలిపింది. 16.7.7 వర్షన్ కంటే ముందు ఓఎస్ వాడే ఐఫోన్8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐపాడ్ ఫిప్త్ జనరేషన్, ఐపాడ్ ప్రో 9.7 యూజర్లు కూడా హ్యాకర్ల బారీన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ డివైజ్ లు అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది.
ఆపిల్ ఉత్పత్తుల యూజర్లు తమ సెక్యూరిటీ ఫీచర్లు అప్ డేట్ చేసుకునే వరకూ కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. పబ్లిక్ వై-ఫై నెట్ వర్క్ల అనుసంధానానికి దూరంగా ఉండాలని సూచించింది. మాల్వేర్ ల నుంచి రక్షణ కోసం ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది. డేటా నష్టపోకుండా బ్యాకప్ చేసుకోవాలని, సెక్యూరిటీ కోసం 2ఎఫ్ఏ విధానాన్ని అమలు చేయాలని సూచించింది.