న్యూఢిల్లీ: పంజాబ్-మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)లో రూ.1800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సెంట్రం గ్రూప్, డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ భారత్ పేలతో కూడిన జాయింట్ వెంచర్ ప్రకటించింది. ఈ జాయింట్ వెంచర్లో పీఎంసీ విలీనానికి ఆర్బీఐ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న పీఎంసీని టేకోవర్ చేసేందుకు సెంట్రం గ్రూప్, భారత్ పే సంయుక్తంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ)ని ఏర్పాటు చేశాయి. ప్రతిపాదిత రూ.1800 కోట్ల నిధుల్లో రూ.900 కోట్లు మొదటి ఏడాదిలో సమకూరుస్తామని సెంట్రం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్పాల్ బింద్రా తెలిపారు.
పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) యాజమాన్యం మొండి బకాయిల వివరాలను వెల్లడించకపోవడంతోపాటు పలు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ తనిఖీలో తేలింది. దీంతో 2019 సెప్టెంబర్లో ఈ బ్యాంకు లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
2019 సెప్టెంబర్ నుంచి ఆర్బీఐ అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షణలో పని చేస్తున్న పీఎంసీ బ్యాంకులో రూ.10,723 కోట్ల డిపాజిట్లు స్తంభించిపోయాయి. ఈ బ్యాంకు ఇచ్చిన రుణాల్లో రూ.6,500 కోట్ల మేరకు మొండి బకాయిలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ హెచ్డీఐఎల్కు ఇచ్చిన రుణాల వివరాలను ఆర్బీఐకి వెల్లడించకుండా పీఎంసీ బ్యాంకు దాచిపెట్టింది. 2019 సెప్టెంబర్ 19న జరిపిన తనిఖీల్లో హెచ్డీఐఎల్కు పీఎంసీ ఇచ్చిన రుణాలు రూ.6,500 కోట్ల పై చిలుకే.
మొత్తం పీఎంసీ బ్యాంకు మంజూరు చేసిన రుణాల్లో 73 శాతం హెచ్డీఐఎల్కే ఇచ్చింది. దీంతో పీఎంసీలో లావాదేవీలపై ఆర్బీఐ మరింత ఆంక్షలు విధించింది ఆర్బీఐ.