IMPCL | న్యూఢిల్లీ, ఆగస్టు 31: మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఇంకో కంపెనీని వదిలించుకునే పనిలో మోదీ సర్కారు నిమగ్నమైంది. ఈసారి ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపీసీఎల్) వంతు వచ్చింది. అక్టోబర్ 15కల్లా కంపెనీ కొనుగోలుపై ఆసక్తిని వ్యక్తపర్చాలంటూ (ఈవోఐ) బిడ్డర్లను గురువారం కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది కూడా. ఐఎంపీసీఎల్లో కేంద్రానికి 98.11 శాతం వాటా ఉన్నది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పాలనలో ఇది పని చేస్తున్నది. మిగతా 1.89 శాతం వాటా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి చెందిన కుమావోన్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (కేఎంవీఎన్ఎల్)కు ఉన్నది. ‘మేనేజ్మెంట్ కంట్రోల్ బదిలీతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఐఎంపీసీఎల్లో ఉన్న మొత్తం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని భావిస్తున్నది. సంస్థలో తమకున్న కొద్దిపాటి వాటాను అమ్మేందుకు కేఎంవీఎన్ఎల్ కూడా సుముఖంగానే ఉన్నది’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) తెలిపింది.
ఐఎంపీసీఎల్ ప్రస్తుతం వివిధ వ్యాధుల నయానికి వెయ్యికిపైగా ఔషధాలను తయారు చేస్తున్నది. ఇందులో 656 క్లాసికల్ ఆయుర్వేదిక్, 332 యునానీ, 71 ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అంతేగాక దేశవ్యాప్తంగా 6వేల జన ఔషధి కేంద్రాలకు, నేషనల్ ఆయుష్ మిషన్ కింద అన్ని రాష్ర్టాలకు ఆయుర్వేద, యునానీ ఔషధాలను ఐఎంపీసీఎల్ సరఫరా చేస్తున్నది. ఇదిలావుంటే గత ఏడాది మార్చి 31నాటికి కంపెనీ పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ రూ.51.98 కోట్లుగా ఉన్నది. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో 35.81 ఎకరాల విస్తీర్ణంలో ఐఎంపీసీఎల్కు ఓ క్యాంపస్ కూడా ఉన్నది.
ఐఎంపీసీఎల్.. మొదలైన దగ్గర్నుంచీ లాభాల్లోనే నడుస్తున్నది. అయినప్పటికీ దీన్ని వదిలించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ పన్నులు చెల్లించక ముందు లాభం రూ.42.77 లక్షలుగా ఉన్నది. 2021-22లో ఇది ఏకంగా రూ.45.41 కోట్లకు పెరిగింది. కేవలం రెండేండ్లలో ఎన్నో రెట్ల లాభాలను పెంచుకున్నది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి రూ.9.93 కోట్ల డివిడెండ్నూ చెల్లించింది. అయినప్పటికీ ఈ కంపెనీని వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో మోదీ సర్కారు ప్రైవేట్పరం చేస్తుండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది.