Telcos Get Relief | సంక్షోభంలో చిక్కుకున్న టెలికం సంస్థలకు కేంద్రం రిలీఫ్ కల్పించనున్నది. టెలికం సంస్థల నుంచి వన్టైం స్పెక్ట్రం యూసేజ్ చార్జీల (ఓటీఎస్సీ) వసూలు నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు సంకేతాలిచ్చింది. టెలికం సంస్థల నుంచి ఏజీఆర్ వసూళ్లపై నాలుగేండ్ల మారటోరియం విధిస్తూ గత నెల 15న కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఓటీఎస్సీల వసూలుపై పునఃపరిశీలించాలని, సమీక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా సారధ్యంలోని బెంచ్ తదుపరి విచారణను వచ్చేనెల 17కు వాయిదా వేసింది. అయితే, కేంద్రం ప్రతిపాదనపై న్యాయస్థానం ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. అయితే ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన అంశాలపై న్యాయస్థానానికి సంతృప్తికర సమాధానం ఇవ్వాలని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని వదిలేయాలని కేంద్రం భావించినా.. విస్తృత ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
దేశీయ టెలికం సంస్థలు కేంద్రానికి ఓటీఎస్సీతోపాటు స్పెక్ట్రం యూసేజ్ చార్జీల కింద రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటిలో భారతీ ఎయిర్టెల్ రూ.8,414 కోట్లు.. వొడాఫోన్ ఐడియా రూ.4,389.8 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఓటీఎస్సీ బకాయిలు పడ్డాయి. 2019 జూలై 4న టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్ఏటీ) తీర్పు చెబుతూ స్పెక్ట్రం కేటాయింపులపై 2013 నుంచి కేంద్రం మాత్రమే ఓటీఎస్సీ వసూలు చేయగలదని పేర్కొంది. ఇది టెలికం కంపెనీలకు పాక్షిక రిలీఫ్ కల్పించింది.
దీనిపై కేంద్రం, టెలికం సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఓటీఎస్సీ వసూళ్లపై యధాతథ పరిస్థితి కొనసాగించాలంటూ 2020 డిసెంబర్ ఏడో తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది.