న్యూఢిల్లీ, నవంబర్ 28: అరుదుగా లభించే కీలక ఖనిజాలున్న బ్లాక్లను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలున్న 20 బ్లాక్లకు బుధవారం తొలి రౌండ్ వేలం నిర్వహించనున్నట్టు మంగళవారం అధికారిక ప్రకటన తెలిపింది. దేశ ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు కీలక ఖనిజాలు ముఖ్యమైనవని, ఆన్లైన్లో రెండు దశల్లో వేలం ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది.
ఎంఎస్టీసీ ఆక్షన్ ప్లాట్ఫామ్లో వేలానికి పెడుతున్న మినరల్ బ్లాక్ల వివరాలు, వేలం నిబంధనలు తదితరాలు అందుబాటులో ఉంచినట్టు ప్రకటన తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగం, రక్షణ, వ్యవసాయం తదితర రంగాలకు అవసరమైన లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్, టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) తదితర ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నామని, ఈ కీలక, వ్యూహాత్మక ఖనిజాలకు భారీ డిమాండ్ ఉందని ప్రభుత్వం వివరించింది.
మైనింగ్ రూల్ సవరణ ద్వారా కేంద్రం 24 రకాల కీలక ఖనిజాల్ని ఇటీవల నోటీఫై చేసింది. అలాగే మూడు కీలక ఖనిజాలు లిథియం, నియోబియమ్, ఆర్ఈఈలకు రాయల్టీ రేట్లకు కూడా కేంద్ర క్యాబినెట్ అక్టోబర్లో ఆమోదం తెలిపింది.
ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు, పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్తో ఈ కీలక ఖనిజాలకు డిమాండ్ పెరుగుతున్నది. డిఫెన్స్, ఫార్మాస్యూటికల్స్, హైటెక్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, గిగా ఫ్యాక్టరీల ఏర్పాటులో ఈ ఖనిజాల్ని వాడాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వాడే లిథియం బ్లాక్లను ఇటీవల జమ్ము కశ్మీర్, కర్ణాటక రాష్ర్టాల్లో గుర్తించారు.
కోల్ ఇండియా, ఎన్టీపీసీలు తదితర దిగ్గజ కంపెనీలు ఈ ఖనిజాల మైనింగ్లో ప్రవేశించేందుకు వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. అలాగే మూడు ప్రభుత్వ రంగ కంపెనీలు కలిసి ఖనిజ్ విదేశ్ ఇండియా పేరుతో ఒక జాయింట్ వెంచర్ నెలకొల్పాయి.