Central Bank on Branches Closer | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) శాఖల మూసివేతపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఆర్థికంగా బ్యాంకును బలోపేతం చేయడానికి సీబీఐ.. దేశవ్యాప్తంగా 13 శాతం శాఖలను మూసివేయడం లేదా విలీనం చేయాలని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2017 జూన్ నుంచి సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) Prompt Corrective Action (PCA) అమలవుతున్నది.
కానీ, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలను మూసివేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని శనివారం ప్రకటించింది. ఇంతకుముందు దేశవ్యాప్తంగా 600 బ్యాంకు శాఖలను మూసేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో సీబీఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నది.
2017 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ మధ్య 186 బ్యాంకు శాఖలను సీబీఐ మూసేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 600 శాఖలను మూసేయాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు నాన్కోర్ అసెట్స్, ఇండ్ల స్థలాల వంటి వాటిని విక్రయించాలని నిర్ణయించిందని సమాచారం.ఇంతకుముందు పొదుపు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలొచ్చినా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల మూసివేత అంశం ప్రస్తావనకు రాలేదు.
100 ఏండ్లకు పైగా చరిత్ర గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇప్పుడు 4,594 శాఖలు ఉన్నాయి. 2017లో ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను, నిబంధనలను కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉల్లంఘించాయని వినికిడి. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా మిగతా బ్యాంకులు కోలుకున్నాయి.