ముంబై, అక్టోబర్ 20: ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.605 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.318 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 505 బేసిస్ పాయింట్లు పెరిగి 4.62 శాతానికి తగ్గడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. అలాగే బ్యాంక్ నికర ఎన్పీఏ 2.05 శాతం నుంచి 1.64 శాతానికి దిగొచ్చింది.
ప్రొవిజన్ కవరేజ్ రేషియో 89.20 నుంచి 92.54కి పెరిగింది. గత త్రైమాసికం చివరినాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.6 లక్షల కోట్ల మార్క్ను అధిగమించి రూ.6,02,284 కోట్లకు చేరుకున్నది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,40,130 కోట్లతో పోలిస్తే 11.51 శాతం అధికం. దీంట్లో డిపాజిట్లు 8.21 శాతం అధికమై రూ.3,71,252 కోట్లకు చేరుకోగా, అడ్వాన్స్లు 17.26 శాతం ఎగబాకి రూ.2,31,032 కోట్లకు చేరాయి.
నికర వడ్డీ ఆదాయం 10.23 శాతం ఎగబాకి రూ.2,747 కోట్ల నుంచి రూ.3,028 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ ఆదాయం 19.07 శాతం ఎగబాకి రూ.7,065 కోట్ల నుంచి రూ.8,412 కోట్లకు చేరుకున్నట్టు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్కు 4,489 శాఖలు ఉండగా, వీటిలో సగం గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం విశేషం.