MGNREGS | గ్రామీణ యువత.. ప్రత్యేకించి నిరుద్యోగులకు పని కల్పించే ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులో కేంద్రం కోత విధించింది. దానికి కారణాలను కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ సోమవారం వెల్లడించారు. ప్రధానమంత్రి అవాస్ యోజన, జల్ జీవన్ మిషన్లకు నిధుల కేటాయింపు పెంచామని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వల్ల గ్రామీణ యువతకు రెట్టింపు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గ్రామీణ శ్రామికులకు ఉపాధి లభిస్తుందన్న అంచనాలతోనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు కేటాయించామని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు. వచ్చే ఏడాది పల్లెవాసులు పట్నాలకు వలస వెళతారని, అందుకే ఉపాధి`కి నిధుల కోత విధించామన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉపాధి హామీ పథకంగా పేరొందిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాని (ఎంజీఎన్ఆర్సీజీఎస్) కి దాదాపు మూడో వంతు నిధులు కోత విధించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయిస్తే, సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపులతో పోలిస్తే 32 శాతం తక్కువ.
`ఒకవేళ వారు (గ్రామీణ శ్రామికులు) పీఎంఏవై, జల్ జీవన్ మిషన్లలో చేరకపోతే, గిరాకీ ఉన్న పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకానికి నిధులు ఎక్కువ కేటాయింస్తామని అనంత్ నాగేశ్వరన్ తెలిపారు. సాధారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ 10.5-11 శాతం ఉంటుందన్నారు. అదే జరిగితే గ్రామీణ శ్రామికులు కొలువుల కోసం పట్టణాలకు వలస వెళతారని జోస్యం చెప్పారు. అందువల్లే ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత విధించినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకానికి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి రూ.79,590 కోట్లు కేటాయించారు. అందులో పట్టణ ప్రాంతాలకు రూ.25,103 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు రూ.54,487 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకానికి రూ.2 వేల కోట్లు కేటాయించి.. సవరించిన అంచనాల్లో రూ.28,708 కోట్లకు పెంచారు. జల్ జీవన్ పథకానికి 2023-24లో రూ.69,684 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు రూ.54,808 కోట్లు మాత్రమే.