CCI on Amazon | రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి అడ్డంకులు తొలుగుతున్నట్లు కనిపిస్తున్నది. 2019లో ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్న ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం సస్పెండ్ చేసింది. దీంతో రిలయన్స్ రిటైల్లో రూ.24,713 కోట్లకు ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి అమెజాన్ సృష్టిస్తున్న అవరోధాలు తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేండ్ల క్రితం ఫ్యూచర్ గ్రూప్లో పెట్టుబడులు, ఆ సంస్థతో ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని అమెజాన్ దాచిపెట్టిందని సీసీఐ పేర్కొంది. తాజాగా సీసీఐ రూలింగ్తో ఫ్యూచర్ గ్రూప్తో జరిగే న్యాయపోరాటంలో అమెజాన్ దెబ్బతిన్నట్లే కనిపిస్తున్నది.
2019లో ఫ్యూచర్ గ్రూప్లో 200 మిలియన్ల డాలర్ల పెట్టుబడి నాటి ఒప్పందంతో రిలయన్స్ రిటైల్లో రూ.24,713 కోట్లకు ఫ్యూచర్ గ్రూప్ విలీనాన్ని అమెజాన్ కొన్ని నెలలుగా అడ్డుకుంటున్నది. 57 పేజీల తీర్పు చెప్పిన సీసీఐ.. 2019 నాటి ఫ్యూచర్ గ్రూప్తో అమెజాన్ చేసుకున్న ఒప్పందాన్ని తాజాగా పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి వరకు 2019 నాటి ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
2019లో ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందానికి ఆమోదం పొందే విషయంలో తప్పుడు, అవాస్తవ ప్రకటనలను అమెజాన్ జారీ చేసిందని సీసీఐ పేర్కొన్నది. ఇందుకు అమెజాన్పై 200 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. 2019లో సీసీఐ ఇచ్చిన అప్రూవల్ను సస్పెండ్ చేయడం అసాధారణం అని ఆ సంస్థ మాజీ అధికారి, ఇండియన్ లా ఫర్మ్ పార్టనర్ శ్వేత దూబే పేర్కొన్నారు. మళ్లీ 2019 ఒప్పందంపై ఆమోదం కోరుతూ సీసీఐకి అమెజాన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సీసీఐ సమయాన్ని కోరే అవకాశం ఉంది.
అమెజాన్కు వ్యతిరేకంగా సీసీఐ ఇచ్చిన ఆదేశాలపై రిలయన్స్, ఫ్యూచర్ స్పందించలేదు. కానీ అమెజాన్ మాత్రం సీసీఐ ఆదేశాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ చేపడతామని పేర్కొన్నది. 2019లో ఫ్యూచర్గ్రూప్లో పెట్టుబడులకు ఆమోదం తెలుపడాన్ని పక్కన బెట్టడంతో ఫ్యూచర్ను రిలయన్స్ రిటైల్లో విలీనం చేయడం తేలిక అవుతుందని ఆయా సంస్థల సన్నిహిత వర్గాలు తెలిపాయి.