న్యూఢిల్లీ, మార్చి 15: గూగుల్ ప్లే స్టోర్ ధరల విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం విచారణకు ఆదేశించింది. ఆరోగ్యకరమైన పోటీయుత వాతావరణానికి భంగం కలిగించేలా గూగుల్ నడుచుకుంటున్నదన్న ఆరోపణలపై సీసీఐ స్పందించింది. కాంపిటీషన్ లా ఉల్లంఘనలకు పాల్పడిందంటూ దర్యాప్తునకు దిగింది. కాగా, పేమెంట్స్ ఇష్యూతో ప్లే స్టోర్ నుంచి గూగుల్ కొన్ని యాప్స్ను ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఇది పెద్ద దుమారాన్నే రేపగా.. మళ్లీ సదరు యాప్లను పునరుద్ధరించిన సంగతీ విదితమే. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీసీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అనుపమ్ మిట్టల్కు చెందిన పీపుల్ ఇంటరాక్టివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెబిగో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్), ఇండియన్ డిజిటల్ మీడియా ఇండస్ట్రీ ఫౌండేషన్ (ఐడీఎంఐఎఫ్) సంస్థలు.. గూగుల్ ప్లే స్టోర్కు సంబంధించి మారిన పేమెంట్ విధానాలతో ఇబ్బందులు పడ్డట్టు సీసీఐ దృష్టికి వచ్చింది. అలాగే యాప్ డెవలపర్లు, పేమెంట్ ప్రాసెసర్లు, ఇతర వినియోగదారులకూ సమస్యలు వచ్చినట్టు సీసీఐ చెప్తున్నది. ఈ నేపథ్యంలోనే కాంపిటీషన్ చట్టంలోని సెక్షన్ 4 ఉల్లంఘన జరిగిందని గుర్తించిన సీసీఐ.. విచారణకు ఆదేశించింది.