NSE Co-Location Scam |నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను అదుపులోకి తీసుకున్నది. ఢిల్లీలో చిత్రా రామకృష్ణను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. దవాఖానలో ఆమెకు వైద్య పరీక్షలు జరిపించారు. అటుపై సీబీఐ కేంద్ర కార్యాలయంలోని లాకప్కు తరలించారు.
అంతకుముందు వరుసగా మూడు రోజులుగా చిత్రా రామకృష్ణను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె నివాసంలో తనిఖీలు జరిపారు. కానీ తమ విచారణలో ఆమె సరైన జవాబులివ్వడం లేదని సీబీఐ అధికారులు తెలిపారు. ఆమెను ప్రశ్నించడానికి ముందు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సీనియర్ సైకాలజిస్టుతో సీబీఐ అధికారులు చికిత్స చేయించారు.
విచారణలో చిత్రా రామకృష్ణ జవాబులు దాటవేస్తున్నారని సీఎఫ్ఎస్ఎల్ సైకాలజిస్టు సైతం ధృవీకరించారు. ఆమెను అరెస్ట్ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చేశారు. చిత్రా రామకృష్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.