న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి పన్ను రిటర్న్లు ఫైల్ చేయడానికి అవసరమయ్యే 2, 3, 5 ఐటీ రిటర్న్ ఫారాల్ని నోటీఫై చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం తెలిపింది. రూ.50 లక్షల వరకూ ఆదాయం కలిగిన వ్యక్తిగత వేతన జీవులు రిటర్న్లు వేసే ఐటీఆర్-1, కంపెనీలకు కావాల్సిన ఐటీఆర్-6లను ఇప్పటికే 2023 డిసెంబర్, 2024 జనవరి నెలల్లో నోటిఫై చేయగా, మిగిలిన 2,3,5 ఫారాలను తాజాగా విడుదల చేసింది.
నోటిఫై అయిన 1 నుంచి 6 వరకూ అన్ని ఐటీఆర్ ఫారాలు 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని సీబీడీటీ తెలిపింది. ఫైలింగ్ను మరింత సరళతరం చేస్తూ ఐటీఆర్ల్లో మార్పులు చేసినట్టు వెల్లడించింది. ఐటీఆర్-1 (సహేజ్) ఫైల్ చేయడానికి అర్హులుకాని, వ్యాపారం లేదా వృత్తుల ద్వారా ఆదాయం ఆర్జించని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్లు) ఐటీఆర్-2 ద్వారా రిటర్న్ వేయాలి. వ్యాపారం లేదా వృత్తుల ద్వారా ఆదాయంగలవారు ఐటీఆర్-3ని ఫైల్ చేయవచ్చు. రూ.50 లక్షల వరకూ మొత్తం ఆదాయం కలిగి, వ్యాపార, వృత్తుల నుంచి ఆదాయం పొందుతున్న భారత నివాసులు, హెచ్యూఎఫ్లు, సంస్థలు (ఎల్ఎల్పీలు మినహా) ఐటీఆర్-4 (సుగమ్)ను దాఖలు చేయాలి. భాగస్వామ్య సంస్థలు, ఎల్ఎల్పీలు ఫారం-6, సెక్షన్ 11 కింద మినహాయింపులు క్లెయిం చేయని కంపెనీలు ఫారం-6ను ఉపయోగించాలి.