Car Rates hike | ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అని సామెత.. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇల్లు కట్టి చూడు.. కారు కొని చూడు అనాలేమో.. కరోనా మహమ్మారి పుణ్యమా? అని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత వాహనానికే మొగ్గు చూపుతున్నారు. కాస్త మెరుగైన ఆదాయం ఉంటే ఫ్యామిలీతో టూర్ వెళ్లాలంటే సొంత కారు ఉండాల్సిందే.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే కార్లు కొనుక్కోవడం తేలికే.. కానీ, కరోనా తర్వాత వివిధ పరిశ్రమలు కుదేలయ్యాయి. నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా రంగాలు తమ వస్తువులు, ముడి సరుకుపై ధరలు పెంచేస్తున్నాయి.. ఇక క్రిప్టో కరెన్సీల ఎఫెక్ట్.. వర్క్ ఫ్రం హోం లేదా లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి పెరిగిపోవడంతో లాప్టాప్లు.. మొబైల్ ఫోన్లు తప్పనిసరి.. బయటకు వెళడానికి సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరూ అభిలషిస్తుంటారు.. కానీ టెక్నాలజీతో తయారవుతున్న కార్లలోనూ ఎలక్ట్రానిక్ గూడ్స్లో మాదిరిగా చిప్లు, సెమీ కండక్టర్ల వాడకం తప్పనిసరి..
సెమీ కండక్టర్లు.. విడిభాగాల తయారీలో కీలకమయ్యే లోహాలు.. స్టీల్ సరేసరి.. ఇన్పుట్ కాస్ట్ హద్దుల్లేకుండా చకచకా పెరిగిపోతోంది. గతేడాది మార్చిలో కిలో స్టీల్ ధర రూ.38. కొన్ని నెలల తర్వాత అది రూ.70కి చేరింది. టన్ను రాగి ధర 5200 డాలర్ల నుంచి 10, 300 డాలర్లకు పెరిగిపోయింది. రోడియం ధర మూడు రెట్లకు పైగా ఎక్కువైంది. మొత్తం కార్ల తయారీలో ముడి సరుకు ఖర్చే 75-80 శాతం ఉంటున్నది. ఫలితంగా ఆయా కార్ల విక్రయాలపై వచ్చే లాభాలు తగ్గిపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో కార్ల తయారీ సంస్థలూ మరో దఫా కార్ల ధరలు పెంచేస్తాం అంటూ సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే ముచ్చటగా మూడు దఫాలు కార్ల ధరలు పెంచిన వివిధ ఆటోమొబైల్ సంస్థలు.. వచ్చే ఏడాది జనవరిలో.. అంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ.. నాలుగోసారి ధరలు పెంచక తప్పదంటున్నాయి. కార్ల తయారీ సంస్థలు సంప్రదాయంగా ప్రతియేటా జనవరిలో ధరలు పెంచుతాయి. ఎంజీ మోటార్స్ ఎండీ కం ప్రెసిడెంట్ రాజీవ్ చాబా మాట్లాడుతూ.. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయినా పూర్తిగా ఆ భారం కస్టమర్లపై మోపలేం అంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో దఫా ధరల పెంపు అనివార్యం అని తేల్చేశారు.
దీనికి తోడు ప్రస్తుతం కార్ల తయారీ సంస్థలను సప్లయ్ చైన్ సంక్షోభం వెంటాడుతోంది. అంటే వివిధ విడి భాగాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలన్నమాట. ఇన్టైంలో అవసరమైన విడి భాగాల కోసం ఇన్వెంటరీ (నిల్వలు) కొనసాగించడం వంటి వ్యూహాలను కార్ల సంస్థలు అమలు చేస్తున్నాయి. ఇది తప్పనిసరిగా క్యాష్ ప్లో, కార్ల తయారీపైన ప్రభావం చూపుతుంది. మార్కెట్ సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర పెంపుపై నిర్ణయం తీసుకోవాలంటున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సీఈవో విజయ్ నక్రా.
విడిభాగాలు, ముడి సరుకు ధరలు పెరిగిపోతే దాని భారం తగ్గించుకోవడానికి కార్లు, వాహనాల ధరలు పెంచక తప్పదని వోల్వో ఎచిర్ కమర్షియల్ వెహికల్ ఎండీ, సీఈవో వినోద్ అగర్వాల్ చెప్పారు. ఇప్పుడు కర్బన ఉద్గారాల నియంత్రణకు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా కార్ల తయారీకి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందన్నారు. బీఎస్-2 లేదా న్యూ కేఫ్ (CAFE) రూల్స్ ప్రకారం 2022 నాటికి కిలోమీటర్కు విడుదలయ్యే కర్బన ఉద్గారాలు 130 గ్రాముల్లోపే ఉండాలి. 2022 ఏప్రిల్ నుంచి 113 గ్రాములకు.. అటుపై 108-104 గ్రాములకు కుదించాల్సి ఉంటుంది.
ఉద్గారాలను నియంత్రించడానికి కార్ల తయారీ కోసం వాడే టెక్నాలజీ ఖర్చు కూడా పెరిగిపోతుందని అంటున్నారు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ. కరోనా నుంచి రికవరీ సాధించాక సేల్స్ విషయంలో రాజీ పడేందుకు మారుతి సహా ఆటోమొబైల్ సంస్థలు సిద్ధంగా లేవు. అందులో భాగంగా పూర్తిగా తమ కార్ల తయారీ భారాన్ని కస్టమర్లపై మోపలేం అంటున్నారు శ్రీవాత్సవ. కరోనా నుంచి కోలుకున్నాక ముడి సరుకు ధరలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి, జూన్, సెప్టెంబర్ నెలల్లో మారుతి సుజుకి తన కార్ల ధరలు పెంచేసింది.
ఈ-కాంపొనెంట్స్కు గ్లోబల్ సప్లయ్ అండ్ ప్రొక్యూర్మెంట్ కూడా సమస్యగానే ఉందని చెబుతున్నారు హ్యుండాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గార్గ్. తమ ముందు పలు సవాళ్లు ఉన్నా కస్టమర్లకు మెరుగైన ధరకే కార్లను అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.