న్యూఢిల్లీ, ఆగస్టు 6: క్రమంగా ఒక్కొక్కటి ప్రభు త్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు తమ రుణాలపై వడ్డీరేటును అర శాతం వరకు పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి కెనరా బ్యాంక్ కూడా చేరింది. రెపోతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. దీంతో రుణాలపై వడ్డీరేటు 7.80 శాతం నుంచి 8.30 శాతానికి చేరుకున్నది.
ఈ నెల 7 నుంచి అమలులోకి వచ్చేలా రుణాలపై నెలవారి చెల్లింపులు మరింత అధికమవనున్నాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణాలు తీసుకోనున్న మహిళలకు 8.05 శాతం వడ్డీరేటును బ్యాంక్ ఆఫర్ చేస్తుండగా, అలాగే ఇతరులు 8.10 శాతం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. మరోవైపు, బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు పలు రుణాలపై పావు శాతం వడ్డీని ఆఫర్ను వచ్చే నెల చివరి వరకు ఇస్తున్న విషయం తెలిసిందే.