న్యూఢిల్లీ, అక్టోబర్ 6: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గాయత్రి ప్రాజెక్ట్స్పై కెనరా బ్యాంక్ తాజాగా ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,000 కోట్లకు పైగా రుణాల వసూలుకు గాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్లో పిటిషన్ వేయగా, ఇప్పుడు కెనరా బ్యాంక్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది.
గతంలో కంపెనీ తీసుకున్న రుణాలకు సంబంధించి 2015లో ప్రతిపాదిత రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు అనుగుణంగా చెల్లింపులు జరగలేదు. దీంతో బ్యాంకుల పుస్తకాల్లో ఈ రుణాలు మొండి బకాయిలుగా మారాయి. బీవోబీ వేసిన దివాలా పిటిషన్కు ఎన్సీఎల్టీ బెంచ్ ఇంతవరకూ ఆమోదం తెలపలేదు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 10న జరుగుతుంది. బీవోబీతో సహా గాయత్రి ప్రాజెక్ట్స్కు రుణాలిచ్చిన బ్యాంక్లు వాటి వద్ద కంపెనీ తనఖా చేసిన షేర్లను మార్కెట్లో నష్టానికి విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల డాటా వెల్లడిస్తున్నది.
కంపెనీ తామిచ్చిన రుణాల్ని నకిలీ సబ్కాంట్రాక్టర్లకు చెల్లింపులుగా మళ్లించిందని, ఆయా కాంట్రాక్టులు రద్దయినా ఈ మొత్తాన్ని రికవరీ చేయలేదంటూ కొన్ని బ్యాంక్లు ఆరోపించాయి. అయితే బ్యాంక్లు చేపట్టిన చర్యల్ని నిలుపుచేయాలంటూ తెలంగాణ హైకోర్టులో గాయత్రి ప్రాజెక్ట్స్ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో ఈ అంశమై తదుపరి విచారణ అక్టోబర్ 11న జరగనుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బరామి రెడ్డి ప్రమోట్ చేసిన ఈ కంపెనీ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం మేరకు ఆయన సతీమణి ఇందిరా రెడ్డి, కుమారుడు సందీప్కుమార్ రెడ్డి.. నాన్ -ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్, ఎండీగా ఉన్నారు.
రుణాలిచ్చిన బ్యాంక్లివీ..
గాయత్రి ప్రాజెక్ట్స్ తీసుకున్న మొత్తం రుణంలో దాదాపు 30 శాతం బీవోబీ, కెనరా బ్యాంక్లు ఇవ్వగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లు కన్సార్షియంలో ఉన్నాయి. చెల్లింపులు చేస్తామంటూ ఏడాదికాలంగా కంపెనీ వాగ్దానం చేస్తున్నదని, కానీ బ్యాంకింగ్ చర్యల్ని జాప్యం చేయడమే దీని వెనుక ఉద్దేశ్యంగా కన్పిస్తున్నదని బ్యాంకర్ ఒకరు ఆరోపించారు.