Kids PPF Accounts | పిల్లల భవితవ్యం కోసం తల్లిదండ్రులు తపన పడుతుంటారు. తమ సంపాదనలో నిర్దిష్ట మొత్తం వివిధ రకాల పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అటువంటి పథకమే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్). ఈ స్కీమ్లో తండ్రి గానీ, చట్టబద్ధమైన గార్డియన్ గానీ.. తమ పిల్లల పేరిట అకౌంట్ నిర్వహించవచ్చు. పీపీఎఫ్-2019 చట్టం ఇందుకు అనుమతి ఇస్తున్నది. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతా నిర్వహించడానికి ఎటువంటి ఆంక్షలు లేవని పీపీఎఫ్-2019 చట్టం చెబుతున్నది.
అయితే, తల్లిదండ్రుల్లో తల్లి లేదా తండ్రి ఎవరైనా తమ పిల్లల పేరిట నిర్వహించే పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. విడిగా గానీ, ఉమ్మడిగా గానీ రూ.1.5 లక్షలకు మించి మదుపు చేయకూడదు. మైనర్ పిల్లలపై పేరెంట్స్ ఉమ్మడిగా గానీ, విడివిడిగా గానీ రూ.1.50 లక్షల లోపు పెట్టుబడి వరకు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.
అంతకు మించి పెట్టుబడి పెడితే మాత్రం ఇన్కం టాక్స్ చెల్లించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు గానీ, పిల్లల పీపీఎఫ్ ఖాతాల్లో కలుపుకుని గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఐటీ మినహాయింపు కోరొచ్చు. అంతకు మించి కంట్రిబ్యూషన్స్ ఉంటే మాత్రం.. ఇన్కం టాక్స్ పే చేయాల్సి ఉంటుంది.
తమ పిల్లల పీపీఎఫ్ కంట్రిబ్యూషన్స్, వడ్డీ ఆదాయం కలగలిపితే ఆదాయం పన్ను చట్టం కిందకు వస్తుందనుకుంటే.. పిల్లలకు గిఫ్ట్ రూపంలో కంట్రిబ్యూషన్ చేయొచ్చు. ఇలా చేస్తే సదరు కంట్రిబ్యూషన్పై వచ్చే వడ్డీ ఆదాయం ఆయా పిల్లల ఖాతాలోకి వెళుతుంది తప్ప.. పేరెంట్స్ అకౌంట్స్లో కలపరు. పిల్లల పీపీఎఫ్ ఖాతాలపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.1500 వరకు పేరెంట్స్ ఖాతాలో చూపొచ్చు. అయితే, వీటిని ఐటీఆర్లోని ఈఐ షెడ్యూల్ కింద క్లయిమ్ చేయాలి.