హైదరాబాద్, ఆగస్టు 17: నిధుల సేకరణలో స్టార్టప్లు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన పలు స్టార్టప్లు భారీ స్థాయిలో నిధులను సేకరించగా..తాజాగా ఈ జాబితాలోకి బైట్ఎక్స్ఎల్ కూడా చేరింది. సీడ్ బీ ఫండింగ్లో భాగంగా 1 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినట్లు ప్రకటించింది. అలాగే తన వ్యాపారాన్ని తమిళనాడుతోపాటు ఒడిశా, కర్ణాటక రాష్ర్టాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఉద్యోగుల సంఖ్యను రెండింతలు పెంచుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 163 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ సంఖ్యను 350కి పెంచుకోనున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో తరుణ్ తెలిపారు. వ్యాపార విస్తరణకు తాజా నిధులు దోహదం చేయనున్నాయన్నారు. వచ్చే మార్చి నాటికి 175 ఇనిస్టిట్యూట్లు, 2.40 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. గతేడాది సంస్థ 2 లక్షల డాలర్ల నిధులను సేకరించిన విషయం తెలిసిందే.