BYJU’S | దేశంలో పేరొందిన ఎడ్ టెక్ స్టార్టప్ ‘బైజూ’స్ నష్టాలు 2021-22లో రూ.6,679 కోట్లకు పెరిగాయని మంగళవారం తెలిపింది. ఈ నష్టాలకు తన అనుబంధ సంస్థలు వైట్ హ్యాట్ జూనియర్, ఓస్మో కారణమని వెల్లడించింది. 2020-21లో నిర్వహణ నష్టం రూ.4,143 కోట్లు వాటిల్లిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొన్నది. వైట్ హ్యాట్ జూనియర్, ఓస్మో వల్ల 45 శాతం నష్టాలు అంటే రూ.3,800 కోట్ల నష్టం వాటిల్లిందని బైజూస్ తెలిపింది.
ఇదిలా ఉంటే 2021-22లో మూడు రెట్లు గ్రోత్ నమోదైంది. బైజూస్ అనుబంధ సంస్థలు ఆకాశ్ వల్ల 40 శాతం, గ్రేట్ లెర్నింగ్ వల్ల 77 శాతం ఆదాయం పెరిగింది. 2020-21లో ఆకాశ్ రెవెన్యూ రూ.1065 కోట్లు ఉంటే 2021-22లో 40 శాతం పెరిగి రూ.1491 కోట్లకు పెరిగింది. 2020-21లో గ్రేట్ లెర్నింగ్ ఆదాయం రూ.354 కోట్లు ఉంటే, 2021-22లో 80 శాతం పెరిగి రూ.628 కోట్లకు దూసుకెళ్లిందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే బైజూ’స్ను గత కొంత కాలంగా వివాదాలు చుట్టుముట్టాయి. బైజూస్’ ఆల్ఫా ఇంక్ పొందిన 120 కోట్ల డాలర్ల టర్మ్ లోన్ బీ ఫెసిలిటీ (టీఎల్బీ లోన్)తో తలెత్తిన ఆర్థిక సమస్యలు న్యాయ వివాదాలకు దారి తీసింది. న్యాయ నిపుణుల అభిప్రాయాల మేరకు సమీప భవిష్యత్లో టీఎల్బీ రుణం చెల్లిస్తామని బైజూస్ పేర్కొంది.