(నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లించకుండా, రూ.5 కోట్ల మేర మోసం చేసిన బెంగాల్ కోల్డ్ రోలర్స్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ విభాగం తెలిపింది. సరైన పత్రాలు లేకుండానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిందనే ఆరోపణలపై అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 26వ తేదీన తిమ్మాపూర్లోని కంపెనీలో, సంస్థ డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు చేయగా నకిలీ స్లిప్పులు, అకౌంట్ పుస్తకాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించగా ప్రాథమికంగా రూ.5 కోట్ల మేర మోసం చేశారని తేలిందని, ఇది మరింత ఎక్కువగా ఉండొచ్చన్నారు. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ సౌరబ్ అగర్వాల్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరుచగా 13 రోజుల కస్టడీ విధించినట్టు చెప్పారు. కంపెనీ ఎండీ రామౌథర్ అగర్వాల్ పరారీలో ఉన్నట్టు చెప్పారు.