మీ పిల్లల ఉన్నత చదువుకు ఎంత దాయాలి?
21 ఏండ్ల సుమకు అమెరికాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో సీటు దొరికింది. అదికూడా మెరిట్లోనే దక్కింది.
అయితే తల్లిదండ్రులదేమో మధ్యతరగతి కుటుంబం. ఇప్పటికే తమ స్థోమతకి మించి చదివించారు. అబ్బాయి కూడా పదోతరగతి మంచి మార్కులతో పాసై ఇంటర్లో చేరేందుకు రెడీగా ఉన్నాడు. సుమకు ఇప్పుడు ఏటా కనీసం రూ.45 లక్షలదాకా యూనివర్సిటీ ఫీజు కోసమే ఖర్చవుతుంది. ఇవిగాక ప్రయాణం, అక్కడి వసతి గురించి లెక్కేసేందుకు కూడా వాళ్లకు ధైర్యం లేదు. అక్కడికి వెళ్లాక ఏదైనా స్కాలర్షిప్ వంటివి దొరికే ఆస్కారం ఉన్నా.. ఇప్పుడు అంత డబ్బు ఎలా అన్నదే ఆ తల్లిదండ్రుల బాధ.
బాగా చదువుకునే పిల్లలున్నా.. చదివించుకోలేని స్థితిని చూసి లోలోపల కుమిలిపోతూనే ఉన్నారు ఆ మిడిల్క్లాస్ మమ్మీ, డాడీ. మరి.. రేపొద్దున మీ సంగతేంటి?.. ఆలోచించారా?..
హైదరాబాద్లో నర్సరీ స్కూల్ ఫీజు కూడా ఏటా కనీసం రూ.35-45వేలదాకా ఉంటోంది. ఇక పుస్తకాలు, యూనిఫామ్ ఇతరత్రా ఖర్చులు రూ.7-8వేలకు తగ్గవు. అలాంటిది పై చదువులకు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గుండుపిన్ను దగ్గర్నుంచి గ్యాస్ బండదాకా.. పెన్సిల్ దగ్గర్నుంచి కిరాణాకొట్టుదాకా పెరిగిన ధరలు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. ఇంటి ఖర్చు ఇప్పటికే 15-20 శాతం పెరిగిపోయింది. కానీ ఆదాయం మాత్రం అంతే. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల చదువు, వారి భవిష్యత్తు సగటు తల్లిదండ్రులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతున్నది.
లక్షలు కాదు.. కోట్లే
ప్రాథమిక విద్యకే ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోతుంటే.. మరి ఉన్నతవిద్య మాటేమిటి?. టెన్త్ తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ లేదా అడ్వాన్స్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కోర్సులకు ఎంత ఖర్చవుతున్నదో తెలుసా?.. మీ పిల్లలు ఎదిగిన తర్వాత ఈ చదువులకయ్యే ఖర్చులు ఇంకెలా ఉంటాయో ఊహించారా?.. విదేశాల్లో చదువాలన్నా లేదా ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వంటి వాటిల్లో చేరాలంటే లక్షలు కాదు.. కోట్ల రూపాయల్ని గుమ్మరించాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి. అందుకే ఇప్పట్నుంచే పక్కా ప్లాన్ వేసుకోవడం మంచిది.
పదేండ్ల తర్వాత ఎంబీఏ ఖర్చెంత?
నేడు ఓ సాధారణ కాలేజీలో ఎంబీఏ చేసేందుకు కనీసం రూ.10 లక్షలవుతోంది. ల్యాప్టాప్, బుక్స్, మెస్ ఫీజులు అదనం. ఇక పేరున్న కళాశాలలకు వెళ్తే రూ.25-40 లక్షలు పెట్టుకోవాల్సిందే. కాబట్టి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా ఈ ఖర్చులు పదేండ్లకు రెట్టింపవడం ఖాయం.
ప్రణాళిక ఎలా?
పక్కాగా చెప్పాలంటే పిల్లలు పుట్టిన ఏడాది నుంచే వాళ్ల విద్య కోసం పొదుపును ప్రారంభించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రణాళిక, పొదుపు ఉండాలి. ఉదాహరణకు పదేండ్ల తర్వాత ఎంబీఏ చదువు కోసం నెలనెలా కనీసం రూ.8వేలనైనా పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ వంటి సాధనాలనూ ఎంచుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్లు, ఎల్ఐసీ స్కీములు, చిల్డ్రన్ పాలసీలు తీసుకుంటే మాత్రం ఇరుక్కుపోతాం. సుదీర్ఘ సమయం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మదుపు నిర్ణయాలుండటం లాభదాయకం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులైతే ఏడాదికోసారి రివ్యూ చేసి మార్పులు, చేర్పులనూ చేయాలి. 5స్టార్ రేటింగ్ ఉన్న బ్లూచిప్, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ను ఎంపిక చేసి, సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మరిన్ని మార్గాల కోసం ఎవరైనా ఆర్థిక నిపుణులనూ సంప్రదించవచ్చు.
చివరగా చెప్పేదేమిటంటే..
అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకుందాం, బంగారాన్ని తాకట్టు పెడదాం, పదేండ్లుంది ఎప్పటికీ ఇంతే జీతం ఉంటుందా?.. అనే రకరకాల ఆలోచనలు వద్దు. ముందస్తు ప్రణాళిక తప్పక అవసరం. పిల్లలు ఒక్కరైనా.. ఇద్దరైనా.. వారి చదువుకు తగ్గ లెక్క వేసుకోండి. అలాగే మనీ మేనేజ్మెంట్ పాఠాలు పిల్లలకూ నేర్పించాలి. మన ఆర్థిక స్థితేంటో వాళ్లకూ అర్థమయ్యేలా వివరిస్తూపోవాలి. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.
-నాగేంద్ర సాయి కుందవరం