Budget 2022 | దేశ ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్ కీలకం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే మంగళవారం నాడు 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరుపుతూ.. వివిధ శాఖలతో సమీక్షిస్తూ బడ్జెట్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో తొలి నుంచి కొన్ని సంప్రదాయాలు అలా కొనసాగుతూ వచ్చాయి. ఆ సంప్రదాయాలు 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చే వరకు సాగాయి. తర్వాత ప్రతియేటా వార్షిక బడ్జెట్ సమర్పించే సంప్రదాయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏయే మార్పులు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్నది. వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నా.. మహమ్మారి వదలడం లేదు. మనదేశంలోనూ కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపుతున్నది. శరవేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ను దృష్టిలో పెట్టుకుని ఆర్థికశాఖ మంత్రి ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతియేటా బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమయ్యే ఆర్థిక శాఖ సిబ్బంది, అధికారులకు రిలీఫ్ ఇచ్చేందుకు హాల్వా వేడుక నిర్వహిస్తారు. స్వయంగా గరిటె కదిపి ఆర్థిక మంత్రి హాల్వాను అందరికి వడ్డిస్తారు. కానీ ఈ ఏడాది ఒమిక్రాన్ను దృష్టిలో పెట్టుకుని హాల్వా వేడుకను రద్దు చేశారు. దీనికి బదులు సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేయడంతో సరిపెట్టారు.
బ్రిటిష్ వలస పాలకుల హయాం నుంచి ప్రతియేటా ఫిబ్రవరి 28న వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పించే వారు. కానీ 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి పలికారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 2017 ఫిబ్రవరి ఒకటో తేదీన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సమర్పించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి బడ్జెట్కు ఆమోదం ప్రక్రియ పూర్తి కావడానికి బడ్జెట్ సమర్పణ తేదీని ముందుకు జరిపారు.
1924 నుంచి అంటే బ్రిటిష్ వలస పాలకుల హయాం నుంచీ రైల్వేశాఖకు, ఇతర శాఖలకు యూనియన్ బడ్జెట్ అనే వేర్వేరు బడ్జెట్లు సమర్పించే వారు. కానీ 2016లో యూనియన్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది అంటే 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పించడానికి కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు. గతంలో ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసులు, సూట్కేసుల్లో తీసుకొచ్చేవారు. కానీ గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ బ్రీఫ్ కేసుకు బదులు టాబ్లెట్తో పార్లమెంట్కువచ్చారు. డిజిటల్ బడ్జెట్ అంటే పేపర్లెస్ బడ్జెట్ సమర్పించారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్ననేపథ్యంలో పేపర్లెస్ బడ్జెట్ ప్రతిపాదించారు. అంతకుముందు 2019 జూలై 5న సీతారామన్ తొలి బడ్జెట్ను ఎర్రని వస్త్రంతో కూడిన బ్యాగ్లో బడ్జెట్ ప్రతులు తీసుకొచ్చారు.
భారత్ రిపబ్లిక్లో పంచవర్ష ప్రణాళికలకు పెద్దపీట వేసేవారు. 1952 నుంచి పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా వార్షిక బడ్జెట్లు సమర్పించేవారు. కానీ 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసింది. అంతే కాదు.. స్వతంత్ర భారతావనికి తొలి ప్రధాని పండిట్ నెహ్రూ హయాం నుంచి అమల్లో ఉన్న పంచవర్ష ప్రణాళికలకు గుడ్బై చెప్పేశారు. చివరి పంచవర్ష ప్రణాళిక 2012-17.