Budget 2022 | మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, లాప్టాప్లు, డెస్క్టాప్ కంప్యూటర్లు.. ఇప్పుడు నిత్యావసరాలు.. ఫ్రిజ్లు, ఏసీలు, టీవీలు కూడా నిత్య జీవితంలో భాగమే. వీటి తయారీలో కొన్ని విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఆయా విడి భాగాల దిగుమతిపై సుంకాలు తగ్గనున్నాయా.. అంటే అవుననే జవాబే వస్తున్నది. మేడిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్రం ఆయా పరికరాల విడి భాగాల దిగుమతిపై సుంకాలు తగ్గించనున్నదని తెలుస్తున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్లో ఈ అంశం చేరుస్తారని అధికార వర్గాల కథనం.
ఆడియో డివైజ్లు, వేరబుల్స్ అంటే. స్మార్ట్ వాచీలు, స్మార్ట్ బాండ్లపైనా దిగుమతి సుంకం తగ్గనున్నదని పేరు చెప్పడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి చేసిన స్మార్ట్ ఫోన్లను విదేశాలకు విజయవంతంగా ఎగుమతి చేసేందుకు విడి భాగాల దిగుమతి సుంకం తగ్గింపు అంశం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.
బ్యాటరీ ప్యాక్లు, చార్జర్లు, యూఎస్బీ కేబుల్స్, కనెక్టర్లు, ఇండక్టివ్ కాయిల్స్, మ్యాగ్నటిక్స్, ఫ్లెక్సిబుల్ పీసీబీఏస్ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ) దేశీయంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యం. 2026 నాటికి భారత్ను 300 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పవర్హౌజ్గా తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పం. ప్రస్తుతం 75 బిలియన్ల డాలర్ల విలువ గల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. భారత్కు 25 బిలియన్ డాలర్ల విలువ గల ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ తయారీ సామర్థ్యం ఉంది. ఇది గ్లోబల్ స్పెండింగ్తో పోలిస్తే 12 శాతం.
ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తిని పెంచడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సియేటివ్ స్కీమ్ అవసరం అని పరిశ్రమ భావిస్తున్నది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, బ్యాటరీలు, స్పీకర్లు, మెకానిక్స్, కేబుల్స్ తయారీలో ఉపయోగించే విడి భాగాలపై 2022-23 నుంచి 2025-26 మధ్య బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధానాన్ని అమలు చేయాలని ఎలక్ట్రానిక్స్ ఇంతకుముందు ప్రతిపాదించింది. అందులో భాగంగా ప్రస్తుతం విధిస్తున్న కస్టమ్స్ డ్యూటీ 20 శాతంలో 2023-24లో 5 శాతం, 2024-25లో 10, 2025-26లో 15 శాతం తగ్గించాలని కోరింది.