న్యూఢిల్లీ, జూన్ 2: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ఖరీదైన 700 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ శ్రేణిలో రూ.39,000 కోట్ల విలువైన 10 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను కోరుతున్నది. అలాగే 4జీ, 5జీ సేవల కోసం మీడియం ఫ్రీక్వెన్సీ శ్రేణి 3,300-3,670 మెగాహెట్జ్లో 70 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది. దీని విలువ రూ.22,190 కోట్లు అని సమాచారం. మొత్తం రూ.61,190 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను కేటాయించాలని టెలికం శాఖకు బీఎస్ఎన్ఎల్ విజ్ఞప్తి చేస్తున్నది. కాగా, బీఎస్ఎన్ఎల్ కోసం 600 మెగాహెట్జ్ శ్రేణిలో 10 మెగాహెట్జ్, 3,600-3,670 మెగాహెట్జ్ శ్రేణిలో 40 మెగాహెట్జ్, 24 గిగాహెట్జ్ శ్రేణిలో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను టెలికం శాఖ ప్రతిపాదించింది. దీనిపై టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ అభిప్రాయాలనూ టెలికం శాఖ తెలుసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఈ కేటాయింపులు వద్దంటూ బీఎస్ఎన్ఎల్ కొత్త డిమాండ్లతో టెలికం శాఖకు వారం రోజుల క్రితం లేఖ రాసినట్టు సంబంధిత వర్గాలు తాజాగా తెలియజేశాయి. 700 మెగాహెట్జ్ శ్రేణిలోని స్పెక్ట్రమ్ వల్ల తక్కువ టవర్లతో ఎక్కువ పరిధిలో సేవల్ని అందించవచ్చు. అలాగే 3,300-3,670 మెగాహెట్జ్లో ఎక్కువ స్పెక్ట్రమ్ను పొందడం వల్ల మెరుగైన 4జీ, 5జీ సేవలకు వీలుంటుంది. అందుకే బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు కోరుతున్నదని సదరు వర్గాలు చెప్తున్నాయి.