లండన్, మే 20: బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషీ సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి.. వార్షిక ‘సండే టైమ్స్ సంపన్నుల జాబితా’లో తొలిసారిగా స్థానం దక్కించుకున్నారు. శుక్రవారం విడుదలైన ఈ రిచ్ లిస్ట్లో ఈ భారత సంతతి దంపతులు 222వ స్థానంలో ఉన్నారు. వీరి సంపద విలువ 730 మిలియన్ పౌండ్లుగా ఉన్నది. ఈ జాబితాలో భారత సంతతికే చెందిన హిందుజా సోదరులు అగ్రస్థానంలో నిలిచారు. వీరి సంపద విలువ 28.472 బిలియన్ పౌండ్లుగా ఉంటుందని అంచనా. బ్రిటన్లో జన్మించిన సునక్.. భారత్లో పుట్టిన అక్షతాను వివాహం చేసుకున్నారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి కూతురే ఈ అక్షతా మూర్తి. కాగా, గత 34 ఏండ్లలో ఈ ర్యాంకుల్లో చోటు పొందిన తొలి ఫ్రంట్లైన్ పొలిటీషియన్ రిషీ సునకేనని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 42 ఏండ్ల రిషీ సునక్.. ఇంతకుముందు హెడ్జ్ ఫండ్ మేనేజర్గా పనిచేశారు. 2015లో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడిగా బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికయ్యారు. ఇదిలావుంటే అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్లో దాదాపు 0.93 శాతం వాటా ఉండగా, దీని విలువే సుమారు 690 మిలియన్ డాలర్లు కావడం విశేషం. ఈ జాబితాలో లక్ష్మీ నివాస్ మిట్టల్, అనిల్ అగర్వాల్, ప్రకాశ్ లోహియా, లార్డ్ స్వరాజ్పాల్, కిరణ్ మజుందార్ షా వంటి ఎన్నారైలూ ఉన్నారు. బ్రిటన్లో మొత్తం 177 బిలియనీర్లున్నట్టు తేలింది. వీరందరి సంపద విలువ 653 బిలియన్ పౌండ్లుగా ఉన్నట్టు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ తెలిపింది.